ఉపాధి హామీలో ఫేక్‌ హాజరుకు చెక్‌..

Spread the love

ఉదయం, సాయంత్రం కూలీల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సిందే

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.ఇప్పటికే పలు సంస్కరణలు అమలు చేస్తుండగా, కొత్తగా ఫేక్‌ హాజరుకు చెక్‌ పడేలా చర్యలు చేపట్టింది. గతంలో ఉపాధి హామీ కూలీల హాజరు మస్టర్లలో నమోదు చేసేవారు. దాంతో ఒకరికి బదులు మరొకరు పనికి హాజరు కావడం, ఒకరే రెండు సార్లు సంతకాలు చేయడం వల్ల ఫేక్‌ హాజరుతో ప్రభుత్వ సొమ్ముకు గండి పడుతున్నది. దీన్ని అరికట్టడానికి ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేసి జియో కనెక్షన్‌తో ఉన్న సీయూజీ (కామన్‌ యూజర్‌ గ్రూప్‌) సిమ్‌ కార్డులను అందజేస్తున్నది.

రోజుకు రెండు సార్లు ఫొటోలు అప్‌ లోడ్‌..
ఉపాధి హామీ కూలీల హాజరు పారదర్శకంగా నిర్వహించేందుకు సీయూజీ సిమ్‌ కార్డులు అందజేస్తుంది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 970 మందికి మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లకు డీఆర్‌డీఓ ద్వారా సిమ్‌ కార్డులు అందజేస్తున్నారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు సార్లు కూలీల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. రెగ్యులర్‌గా కూలీల పేర్లు, ఫొటోలతో కలిపి అప్‌లోడ్‌ చేస్తేనే వారికి కూలీ అందుతుంది. అయితే ముందు రోజే కూలీల డిమాండ్‌ బట్టి మస్టర్‌ సంబంధిత సిబ్బందికి ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇండెంట్‌ పెడితే దాని ఆధారంగా వారి పేర్లతో కలిపి మస్టర్‌ సదరు యాప్‌లో డౌన్‌లోడ్‌ అవుతుంది. ఆ యాప్‌లో డౌన్‌లోడ్‌ అయిన కూలీల పేర్ల స్థానంలో క్లిక్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. దాంతో ఉపాధి పనులకు హాజరు కాని వారి పేర్లను ఈ యాప్‌లో నమోదు చేయడానికి అవకాశం ఉండనందున్న ఫేక్‌ హాజరుకు ఫుల్‌ స్టాప్‌ పెట్టవచ్చు. ఈ యాప్‌తో ఇక నుంచి ఒకరికి బదులు మరొకరు సంతకాలు పెట్టే అవకాశం ఉండదు.

నేటి నుంచి పెరుగనున్న కూలీ వేతనం
ఉపాధి కూలీ వేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి యూపీఏ ప్రభుత్వం 2006 ఫిబ్రవరిలో ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టగా ఆరంభంలో కూలీలకు రెగ్యులర్‌గా రూ.49 కూలీగా చెల్లించింది. కాలానుగుణంగా అది పలు సార్లు పెరగ్గా ప్రస్తుతం రోజు వారి కూలీ రూ.257గా అమలు అవుతుంది. అయితే కూలీల వేతనం పెంచాలని చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుండగా ప్రస్తుత కూలీకి మరో రూ.15 పెంచింది. దీన్ని శనివారం నుంచి అమలు చేయాలని గ్రామీణాభివృద్ది శాఖ యంత్రాంగాన్ని ఆదేశించింది. నల్లగొండ జిల్లాలో 3,52,872 జాబ్‌ కార్డులు ఉండగా 7,59,779 మంది కూలీల రిజిస్టర్‌ చేసుకున్నారు. వారిలో ప్రస్తుతం జిల్లాలో రెగ్యులర్‌గా 45 మంది సగటున కూలీలు హాజరవుతుండగా గరిష్టంగా లక్షకు పైగా వేసవి సమయంలో హాజరు కానున్నారు. అయితే కొవిడ్‌ సమయంలో మాత్రం 1.61లక్షల మంది హాజరయ్యారు.

ఫేక్‌ హాజరు అరికట్టేందుకు సిమ్‌ కార్డులు
ఉపాధి హామీ పథకంలో ఫేక్‌ హాజరు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇందుకు కొవిడ్‌కు ముందే ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎన్‌ఎంఎంఎస్‌(నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం) యాప్‌ను అమల్లోకి తెచ్చింది. అయితే ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ డిమాండ్లతో సమ్మెకు వెళ్లడంతో ప్రభుత్వం వారిని విధుల్లో నుంచి తొలగించి సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నది. అప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించగా వారు కూలీల హాజరు మాన్యువల్‌గానే తీసుకున్నారు. దాంతో మళ్లీ కూలీల హాజరు ఫేక్‌గా నమోదై అవకతవకలు జరిగాయి. ఈ తరుణంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి వచ్చారు. దాంతో ప్రభుత్వం మరోసారి వారికి స్వాధీనం చేసుకున్న సీయూజీ సిమ్‌ కార్డులు అందజేస్తుంది.

పారదర్శకత కోసం సిమ్‌ కార్డులు
ఉపాధి హామీ పథకంలో కూలీల హాజరు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సిమ్‌ కార్డులు అందజేస్తున్నాం. ప్రతి రోజు పని ప్రదేశంలో పని ప్రారంభంతో పాటు పని పూర్తి కాగానే ఫొటోలు తీసి ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. దాంతో ఒకరికి బదులు మరొక కూలీ హాజరు కావడం, సంతకం పెట్టడం లాంటివి జరగడానికి అవకాశం ఉండదు. అయితే ఫీల్డ్‌ అసిస్టెంట్లు దీన్ని రెగ్యులర్‌గా అమలు చేయటంతో పాటు ప్రతి గ్రామంలో కనీసం వంద మంది కూలీలు పనికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page