పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతులపై దృష్టి సారించాలి

Spread the love

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌళిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మల్సూర్ తాండ గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి, పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, రన్నింగ్ వాటర్ తో టాయిలెట్ తదితర అన్ని మౌళిక సదుపాయాలు వుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

కాంపౌండ్ వాల్ లేని పోలింగ్ కేంద్రాల పాఠశాలలకు కాంపౌండ్ వాల్/ ఫెన్సింగ్ వెంటనే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకే లోకేషన్ లో ఒకటికి మించి ఎక్కువ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ఉన్నచోట, క్యూ రద్దీ, భద్రతా సమస్యలు తలెత్తకుండా వేర్వేరు బ్లాకులో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రం లోపల ఫ్యాన్లు, లైట్లు వుండేలా, కేంద్రం వెలుపల వెలుతురు వుండేలా లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఓటర్లకు, పోలింగ్ సిబ్బంది కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, విద్యాశాఖ ఇఇ నాగశేషు, తల్లాడ మండల తహసీల్దార్ రవికుమార్, ఎంపిడివో చంద్రమౌళి, ఇర్రిగేషన్ డిఇ శ్రీనివాసరావు, అధికారులు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page