సీఎం జగన్‎పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి 20 స్పెషల్ టీమ్స్..

Spread the love

సీఎం జగన్‎పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

ఎయిర్‌గన్నా? క్యాట్‌బాలా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ ఆయుధాలను వినియోగించే వారికోసం గాలిస్తున్నారు.

15 రోజులుగా గంగానమ్మ గుడి దగ్గర సెల్‌టవర్‌ నుంచి వెళ్లిన కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన క్లూస్ టీమ్స్‌ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్‌ ఏర్పాటై.. ఆధారాలు సేకరిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల నుంచి స్టేట్‌మెంట్స్‌ రికార్డు చేయిస్తున్న డీజీపీ.. కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంత దూరం నుంచి జగన్‌కు తగిలేలా రాయి ఎలా విసిరారనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. దాడి జరిగిన ప్రాంతంలో ఇన్‌కమింగ్, ఔట్‌గౌయింగ్ కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినా, వచ్చినా వాటిపై ఆరా తీస్తున్నారు.

ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న అధికారులు.. అతి త్వరగా ఈ కేసు నిందితులను పట్టుకోవాలని చూస్తున్నారు. సీఎం వాహనం‎కు ఉన్న సీసీ టివి పుటేజ్‎తో పాటు పోలీస్ వాహనాలకు ఉన్న సీసీ ఫుటేజ్‎ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

వాహనాలకు కెమెరాలు ఉన్నప్పటికీ ఫోకస్ లైట్స్‎తో క్లియర్‎గా వీడియోలు కనిపించడం లేదు. గంగాలమ్మా గుడి ఐసోలేషన్ లోకేషన్లో కాల్ డేటా డంప్, సాంకేతిక డేటా ఫిల్టల్ చేస్తున్నారు. ఈ కేస్ విచారణలో దాదాపు 20 టీమ్‎లు పని చేస్తున్నాయి. అనుభవజ్ఞులైన డీసీపీ, ఏ డి సి పి, డిఎస్పి ర్యాంక్ అధికారులు రంగంలోకి దిగి అణువణువూ గాలిస్తున్నారు. నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related Posts

You cannot copy content of this page