చనిపోతే ‘జై జవాన్’ అనడం కాదు.. మా భార్య పిల్లలు భూములకు రక్షణ కల్పించండి

Spread the love

చనిపోతే ‘జై జవాన్’ అనడం కాదు.. మా భార్య పిల్లలు భూములకు రక్షణ కల్పించండి
— ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే గ్రామాల్లోని మా భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు
— విలేకరుల సమావేశంలో బాధితుడు దేశ సైనికుడు దోమల ఉపేందర్ రావు ఆవేదన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

భార్యాపిల్లలు, భూములను వదిలి ప్రాణాలను లెక్కచేయకుండా దేశ సరిహద్దులో దేశ రక్షణకోసం కాపలకాస్తు ఉద్యోగం ఉద్యోగం చేస్తుంటే.. మా గ్రామాల్లోని భార్య పిల్లలు, భూములకు రక్షణ లేకుండా పోయిందని, 16 సంవత్సరాలుగా పారా మిలటరీలో దేశ సరిహద్దు బోర్డర్ లో ఉద్యోగం చేస్తున్న కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామానికి చెందిన సైనికుడు దోమల ఉపేందర్ రావు ఆవేదన వ్యక్తం చేశాడు. శనివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎస్సీ కులమునకు చెందిన వారిగా గత 60 సంవత్సరాలుగా ముచ్చర్ల రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 59లో వేరు వేరు చోట 17 ఎకరాల 15 గుంటల భూమిని సాగు చేసుకుంటూ అనుభవదారులుగా నాటి నుండి నేటి వరకు దానిపైనే జీవనం సాగిస్తున్నామన్నారు.

మా కుటుంబ సభ్యులకు ఆ భూమిపై కొనుగోలు చేసిన కాగితాలు, శిస్తు కట్టిన కాగితాలు అన్నీ ఉన్నాయన్నారు. ధరణి వచ్చిన తర్వాత కేవలం 2 ఎకరాల 15 కుంటల భూమిని మాత్రమే పాస్ పుస్తకంలో ఎక్కించారు. సాగు చేసుకుంటూ అనుభవంలో ఉన్నప్పటికీ.. మిగతా భూమిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా ఉండండం, అగ్రకులాల వారికి సహకారాన్ని అందిస్తుండడంతో జాస్తిపల్లి సర్వేనెంబర్ 306 లో ఉన్న మా భూమిని తూము బాబు, తూము శేషు, తూము వెంకటేశ్వర్లు, తూము వెంకట నరసయ్య, తూము భాస్కర్ లు అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మా భూమిలో వేసిన పత్తి పంటను గత సంవత్సరం 26న దౌర్జన్యంగా ట్రాక్టర్ తో పంటను తొక్కి పాడు చేశారని వాపోయాడు.

ఈ విషయంపై కామేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని అన్నారు. కామేపల్లి తహసిల్దార్ కు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశానని కానీ సర్వేనెంబర్ 59 లో ఉన్న మా భూమిని 58 సర్వే నెంబర్ లో ఉన్నట్టు తప్పుడు రిపోర్ట్ తో తహసిల్దార్.. పై అధికారులకు అందజేసి మాకు అన్యాయం చేశాడని ఆరోపించారు. సదరు సర్వేయర్, తహసిల్దార్ లు అవినీతికి పాల్పడుతూ తప్పుడు రిపోర్టులతో మాకు అన్యాయం చేస్తూ అగ్రకులాల వారికి అండగా ఉంటున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. దేశ సరిహద్దుల్లో మా భార్య పిల్లలు ఆస్తులను వదిలి మా ప్రాణాలను లెక్కచేయకుండా ఉద్యోగం చేస్తుంటే అక్రమంగా మా ఆస్తుల్ని ఆక్రమించుకోవడం ఎంతవరకు న్యాయమని, ‘జవాన్ చనిపోతే జై జవాన్ అనడంకాదు’.. బ్రతికున్నప్పుడే జవాన్ కుటుంబ సభ్యులకు ఆస్తులకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. విలేకరుల సమావేశంలో తండ్రి దోమల ఆనందరావు, తల్లి దోమల భాగ్యమ్మ , అన్న దోమల రవి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page