దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ

Spread the love

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముందుగానే చెల్లించి తర్వాత ఆ డబ్బు కోసం అరబిందో గ్రూప్‌నకు చెందిన శరత్‌చంద్రారెడ్డిపై ఒత్తిడి చేసినట్లు సీబీఐ అధికారులు ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దిల్లీ మద్యం కేసులో గురువారం తిహాడ్‌ జైల్లో కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ అధికారులు ఉదయం ఆమెను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి 5 రోజుల కస్టడీ కోరారు. ‘‘కవితను 2022 డిసెంబరు 11న హైదరాబాద్‌లో విచారించాం. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాల ఆధారంగా ఆమెను మరింత సమగ్రంగా విచారించాల్సి ఉంది. పలువురి వాంగ్మూలాల ప్రకారం ఈకేసులో ప్రధాన కుట్రదారుల్లో ఆమె కూడా ఒకరని తేలింది. న్యాయస్థానం ఇచ్చిన అనుమతి మేరకు 6వ తేదీన తిహాడ్‌ జైల్లో విచారించాం. ఆమె సమాధానాలు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలకు భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలి’’ అని సీబీఐ అధికారులు న్యాయమూర్తిని కోరారు.

అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధం: కవిత న్యాయవాది విక్రమ్‌చౌధరి

కవిత అరెస్ట్‌ అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌చౌధరి వాదనలు వివరించారు. ‘‘కవితకు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్నసాక్ష్యాధారాలు ఏడాది కాలానికి ముందువి. ఆ అంశాలపై ఇప్పుడు అరెస్ట్‌ చేసి ప్రశ్నించాలని చెప్పడంలో అర్థం లేదు. ఆ సాక్ష్యాలకు, ప్రస్తుత అరెస్ట్‌కు ఎలాంటి సంబంధంలేదు. గతంలో అరెస్ట్‌ చేయడానికి సుముఖత చూపని సీబీఐ ఇప్పుడు అరెస్ట్‌ చేయడానికి కారణం లోక్‌సభ ఎన్నికలే. ప్రజాభిమానం ఉన్న నాయకురాలి కస్టడీని పొడిగించడం కోసం ఇప్పుడు అరెస్ట్‌ చేశారు. పార్టీలో కీలకంగా ఉన్న ఆమెను జైల్లోనే ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికల సమయం ఆమెకు చాలా కీలకం. అరెస్ట్‌ విషయంలో సీబీఐ నిబంధనలు పాటించలేదు. ఇలా చేయడం అధికార దుర్వినియోగం కిందికి వస్తుంది’’ అని న్యాయమూర్తికి వివరించారు….

Related Posts

You cannot copy content of this page