ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల మేరకు అన్ని కార్యక్రమాల్లో ప్రగతిని సాధించాలి.

Spread the love

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల మేరకు అన్ని కార్యక్రమాల్లో ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపిడివో లు, తహశీల్దార్లు, ఇంజినీరింగ్ అధికారుల తో పోడు పట్టాలు, గ్రామ పంచాయతీ భవనాలు, తెలంగాణ కు హరితహారం, జీవో 58, 59 అమలు, గొర్రెల అభివృద్ధి పధకం, బిసి బంధు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వంద శాతం ప్రగతి సాధించాలన్నారు.

జిల్లాలో 6509 పోడు పట్టా పాస్ బుక్కులు జారిచేసినట్లు, ఒకటి కంటే ఎక్కువ ప్యాచెస్ ఉన్నచోట సమస్యలు వస్తున్నట్లు, వీటిపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 66 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయగా, 47 చోట్ల పనులు ప్రారంభం అయినట్లు, మిగతా చోట్ల సమస్యలు పరిష్కరించి, పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రఘునాథపాలెం లో నిర్మాణంలో ఉన్న స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్సీ, సింగరేణి లో నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

జిల్లాలో ఈ సంవత్సరం 32.477 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యం కాగా, ఇప్పటికి 14 లక్షల ప్రగతి సాధించినట్లు ఆయన తెలిపారు. మొక్కలు డిస్ట్రిబ్యూషన్ రెండు రోజుల్లో, మొక్కలు నాటడం నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో బిపిఎల్ కుటుంబాలకు ఇంటి స్థలాల కొరకు 2895 ప్లాట్లకు గాను, 3928 దరఖాస్తులు వచ్చినట్లు, ఇప్పటికి 1100 లబ్దిదారుల జాబితా అందినట్లు, మిగతా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, అర్హుల జాబితా సమర్పించాలన్నారు.

జీవో 58 క్రింద 17000 దరఖాస్తులు రాగా, 8000 దరఖాస్తుల విచారణ పూర్తి అయిందని, మిగతా దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసి, త్వరితగతిన పరిష్కరించాలన్నారు. జీవో 59 క్రింద రెండో విడత డిమాండ్ నోటీసులు జారీచేయాలని, జారీ చేసిన డిమాండ్ వసూలుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. విఆర్ఏ లకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలన్నారు. జిల్లాలో పెండింగ్ సీఎంఆర్ బియ్యానికి సంబంధించి, మిల్లర్లు త్వరితగతిన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గొర్రెల అభివృద్ధి పథకం క్రింద రెండో విడతలో 140 యూనిట్లు లబ్ధిదారులకు అందజేసినట్లు, వచ్చే 15 రోజుల్లోగా 520 యూనిట్లు పంపిణికి చర్యలు చేపట్టాలన్నారు.

బిసి బంధు క్రింద వచ్చిన దరఖాస్తుల్లో స్క్రూటిని పిదప అర్హుల జాబితా సమర్పించాలన్నారు. జిల్లాలో సరిపడా యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ అన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, డి. మధుసూదన్ నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ అప్పారావు, డీఆర్డీఓ విద్యాచందన, జిల్లా పశుసంవర్ధక అధికారి వేణు మనోహర్, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, ఇఇ పీఆర్ కెవికె. శ్రీనివాస్, జిఎం ఇండస్ట్రీస్ అజయ్ కుమార్, కలెక్టరేట్ ఏవో అరుణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page