ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం దూకుడు..

Spread the love

ప్రత్యేక పీపీ నియామకం

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న తెలంగాణ ఫోన్ టైపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేశారు దర్యాప్తు అధికారులు. అయితే వీరిలో ప్రస్తుతం ఇద్దరు నిందితులు నాంపల్లి కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.

సాధారణంగా పోలీస్ స్టేషన్‎కు సంబంధించిన క్రిమినల్ కేసుల కోసం ప్రత్యేక పీపీలు ఉంటారు. అయితే ఫోన్ టాపింగ్ వ్యవహారం హై ప్రొఫైల్ కేస్ కావడంతో ఈ కేసును సాధారణ కేసులతో కాకుండా ప్రత్యేకంగా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఈ ఒక్క కేసు కోసం ప్రత్యేక పీపీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ పిపిగా సాంబశివరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టుకు సైతం పోలీసులు ప్రకటించారు. నాంపల్లి కోర్టులో స్పెషల్ పీపీ ఉత్తర్వుల కాపీని జోడిస్తూ మెమో దాఖాలు చేశారు.

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‎పై వాదనలు ముగిశాయి. సోమవారం రోజు ప్రణీత్ బెయిల్ పిటిషన్‎పై నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. మరో నిందితుడు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న సైతం నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్‎పైన సోమవారం వాదనలు జరగనున్నాయి. ఇక ఈ కేసులో మొదటిసారి స్పందించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. హైదరాబాద్ పాతబస్తీలోని మిరాళం ఈద్గాను సందర్శించిన ఆయన ఫోన్ టాపింగ్ వ్యవహారంపై స్పందించారు.

ఈ కేసులో త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అంశం పైన త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని హైదరాబాద్ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ సిపి వ్యాఖ్యల తర్వాత మొదటి నోటీసులు ఎవరికి వెళ్తాయో అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనియాఅంశమైంది. అయితే ఇప్పటికే అరెస్టు అయిన అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నోటీసులు సిద్ధం చేసుకున్నారు పోలీసులు. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ అధికారులకు సంబంధించిన డబ్బుల తరలింపును ఇప్పటికే రాధా కిషన్ రావు కన్ఫెస్ చేసినట్లు పోలీసులు రిపోర్ట్‎ను కోర్ట్‎కి సబ్మిట్ చేశారు. ఒక ఎమ్మెల్సీ‎తో పాటు కీలక ఎమ్మెల్యేలకు చెందిన అనుచరులకు సైతం మొదటి దఫాలో పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.

గత ఎన్నికల సమయంలో అధికార పార్టీకి సంబంధించిన డబ్బులను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేర్చడంలో కీలకంగా వ్యవహరించారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. దీంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్టేట్మెంట్లను సైతం ఇప్పటికే దర్యాప్తు అధికారులు రికార్డ్ చేశారు. వారిని సాక్షులుగా పేర్కొంటూ పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధం అయ్యారు. వచ్చే వారంలో రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

Related Posts

You cannot copy content of this page