SAKSHITHA NEWS

తెలంగాణలో కేసిఆర్ ను గద్దె దించడమే లక్ష్యం

  • రాబోయే ఎన్నికల్లో శీనన్న జెండా… ఎజెండా ఇదే
  • పాలేరు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
  • సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు ఎప్పుడు కడుగుతారు
  • తెలంగాణ రాష్ట్రం లో ఐదు లక్షల కోట్లు అప్పులు
  • ప్రాణ త్యాగాలు చేసిన విద్యార్థుల ఆత్మ గోసిస్తుంది

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జెండా ఏదైనా ఎజెండా ఒకటేనని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం… ఖమ్మం జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొట్టడమే లక్ష్యమని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వేలాది మంది ప్రజల ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రాష్ట్రం సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి పై 1,35,000 అప్పు ఉందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో భారీ ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న అధికార పార్టీ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు ఎప్పుడు కడుగుతారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభల్లోనూ అసెంబ్లీ సాక్షిగా చేసిన వాగ్దానాలు అమలు కాలేదన్నారు.

కేసీఆర్ ని కేటీఆర్ ను నమ్మి టిఆర్ఎస్ లో చేరాను ఆ తర్వాత వారి చేష్టాలు నన్ను ఇబ్బందులకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే దానికి సమాధానం చెబుతారని, కేసీఆర్ మాయ మాటలు ప్రజలు నమ్మరన్నారు. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో అధికార పార్టీని మట్టి కరిపించడమే శీనన్న టీం లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇంతవరకు ఐదు లక్షల మందికి రుణమాఫీ చేశారని ఇంకా 31 లక్షల మంది చేయాల్సి ఉందని అన్నారు.

ఇంకా ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉందని ఎప్పుడు రుణమాఫీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, రామ సహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, డాక్టర్ కోట రాంబాబు, విజయ బాయి, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, నెల్లూరి భద్రయ్య, బజ్జూరి వెంకట్ రెడ్డి, కొడాలి గోవిందరావు, చెరువు స్వర్ణ, అజ్మీరా అశోక్, మద్ది కిషోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రవీంద్రబాబు, జీవన్ రెడ్డి, శివ సాగర్, దుబ్బాకుల వెంకటేశ్వర్లు, ఎన్ వి శేషు, కొప్పుల చంద్రశేఖర్, కార్పొరేటర్ దొడ్డా నగేష్, పీఎస్ఆర్ యువజన విభాగం అధ్యక్షుడు మొగిలిశెట్టి నరేష్, యువనేత గోపి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS