తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దని గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు

Spread the love

తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దని గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘‘రెండు రోజుల క్రితం ఊహించనివిధంగా చిన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి వస్తున్న రూమర్స్‌ నమ్మకండి. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. మంగ్లీ త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే?
శంషాబాద్‌ మండలం తొండుపల్లి సమీపంలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆమె త్రుటిలో తప్పించుకున్నారు. శంషాబాద్‌ పోలీసుల వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో హైదరాబాద్‌- బెంగళూరు జాతీయరహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. తొండుపల్లి వంతెన వద్దకురాగానే కర్ణాటకకు చెందిన ఓ డీసీఎం వ్యాన్‌ వెనక నుంచి వేగంగా వచ్చి వీరి కారును ఢీకొట్టడంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనక భాగం దెబ్బతింది. డీసీఎం డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నాడు. దీనిపై పలు యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లలో వచ్చిన రూమర్స్‌పై ఆమె స్పందిస్తూ ఈ పోస్ట్‌ పెట్టారు.

Related Posts

You cannot copy content of this page