మీకు అండగా నేనుంటా..రైతులకు పవన్ కళ్యాణ్ భరోసా…

Spread the love

రైతులకు కష్టం వస్తే ప్రభుత్వం ఎక్కడుందో తెలియదు?
ధాన్యం కొనాలంటే పవన్ కళ్యాణ్ రావాలా?
•పంట నష్టపోతే అధికారులు తొంగి కూడా చూడలేదు
•పుస్తెలు తాకట్టు పెట్టి పంట పండించాం
•మీరు వస్తున్నారు అంటేనే ధాన్యం కొనేందుకు సిద్ధమయ్యారు
•కడియం ఆవలో కళ్యాణ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్న రైతులు
•అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్
•రైతు కష్టాలు అడిగి తెలుసుకున్న జనసేన అధ్యక్షులు
•ప్రతి గింజా కొనేవరకు జనసేన పోరాడుతుందని భరోసా

రాజమహేంద్రవరం, : అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులకు పవన్ భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే వరకు తాను పోరాటం చేస్తానని వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యం కొనాలి అంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రావాలా.. పవన్ కళ్యాణ్ వస్తేనే ధాన్యం కొంటామంటే ఆయన మాత్రం ఎన్ని ఊర్లు తిరగాలి? ఎన్ని రోజులు తిరగాలి? ఇళ్లలో ఆడవారి పుస్తెలు తాకట్టు పెట్టి పంటలు పండించాం” అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజక వర్గం కడియం ఆవ ప్రాంతం రైతులు తమ గోడును జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందు వెళ్లబోసుకున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పరామర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఉదయం రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనసేనానికి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్‌ కళ్యాణ్.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతుల నుంచి వివరాలను పవన్‌ కళ్యాణ్‌ అడిగి తెలుసుకున్నారు.


ఈ క్రమంలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీరు వస్తున్నారనే ధాన్యం కొనుగోలును వేగవంతం చేశారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు పలువురు రైతులు తెలిపారు. ఇంకా కోతలు కోయాల్సి ఉన్నా.. గోనె సంచులు కూడా ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్‌కు రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. నూక, ట్రాన్స్‌పోర్ట్ పేరుతో రైతులని మిల్లర్లు దోచేస్తున్నారని పవన్ ముందు రైతులు కంటతడి పెట్టారు. దిక్కుతోచని పరిస్థితుల్లో తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం వివరాలను, రైతుల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు రాజమండ్రి నగరం, బొమ్మూరు, రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ఆవ భూములలో దెబ్బతిన్న వ్యవసాయ భూములను పవన్ కళ్యాణ్ పరిశీలించి రైతులను పరామర్శించారు. అకాల వర్షాల వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రైతులకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


ముఖ్యమంత్రి రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రకటించారు. ఆ నిధి ఏమయ్యిందో ప్రభుత్వంలో ఉన్న వారికే తెలియాలి. వర్షాలు, వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉంటే ఆ డబ్బు ఎక్కడ దాచుకున్నారు? ఎకరాకి రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చు అయ్యింది. అకాల వర్షాలకు ఎకరాకి 20 బస్తాలు పైనే నష్టపోయాం. ధాన్యం నల్లపాయ వచ్చేసింది. మాకు వ్యవసాయం తప్ప మరో పని చేతకాదు. మద్దతు ధర రూ.1530 ఉంటే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తూ తరుగు పేరిట బస్తాకి రూ. 200 వరకు కోత పెడుతున్నారు. ఆ ఖర్చులు ఈ ఖర్చులు రైతుల నెత్తినే వేస్తున్నారు. బస్తాకి రూ. 1200 నుంచి రూ. 1300 మాత్రమే వస్తోంది. మొలక వచ్చిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని అస్సలు కొనడం లేదు. రైతు పండించిన ధాన్యాన్ని మాత్రమే కొనమని అడుగుతున్నాం. మొదట 33 బస్తాలు కొంటామన్నారు. రైతులంతా ధర్నా చేస్తే ఇప్పుడు కొంత పెంచారు.

తీసుకున్న ధాన్యానికి డబ్బులు ఎప్పుడొస్తాయో తెలీదు
రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనాలి. కొంతే కొంటామంటే ఎలా? మీరు పవన్ కళ్యాణ్ వస్తున్నారని ఇప్పుడు హడావిడిగా ధాన్యం తోలేస్తున్నారు. తోలిన ధాన్యానికి అక్కడికి వెళ్లాక వంకలు పెడుతున్నారు. దానికీ డబ్బులు ఎప్పటికి వస్తాయో తెలియదు. రైతు భరోసా కేంద్రాలకు చెందిన వాళ్లు, స్థానిక నాయకులు వచ్చి ఒక వంతు ధాన్యం వెళ్లిపోయింది.. మూడొంతుల ధాన్యం వెళ్లిపోయిందని చెబుతున్నారు. ధాన్యం ఇంకా చాలా వరకు కళ్లాల్లోనే ఉంది. మీకు చూపాలనే లోడు చేసిన లారీలు అడ్డుకున్నాం.
చివరికి కాలువల్లో పూడిక మేమే తీసుకుంటున్నాం. మరమ్మతులు మేమే చేసుకుంటున్నాం. ఆవలో ఖరీఫ్ మొత్తం నీళ్లలోనే మునిగి ఉంటుంది. రబీ ఒక్కటే మిగిలేది. ఇప్పుడు అకాల వర్షాలకు అదీ పోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల కష్టాలు ఓపికగా ఆలకించిన పవన్ కళ్యాణ్ పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ , ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page