SAKSHITHA NEWS

అధికారులు శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలి
-జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్


సాక్షిత : అధికారులు శిక్షణ ను సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా తహశీల్దార్లు, సెక్టార్ అధికారులకు, ఎన్నికల విధులు, డిస్ట్రిబ్యూషన్, రిషిప్షన్ కేంద్రాల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ, అవగాహనా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు పోలింగ్, పోలింగ్ యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన కల్గి వుండాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలన్నారు. మాక్ పోలింగ్, పోలింగ్ సందర్భంలో సాంకేతిక సమస్యలు ఎదురయినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు అసెంబ్లీ సెగ్మెంట్ల కేంద్రాల్లో వుంటాయని, రిషిప్షన్ కేంద్రం కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు ఉంటుందని అన్నారు. పోలైన ఇవిఎం ల రవాణా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మాత్రమే చేపట్టాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి ఒక కలర్ కోడ్ తో రవాణా సిబ్బందికి టీ షర్టులు ఇవ్వాలన్నారు. నివేదికను నిర్ణీత సమయంలోగా సమర్పించాలన్నారు. ఎన్నికల సంఘంచే జారీచేసిన హ్యాండ్ బుక్, పూర్తిగా చదివి, ఏ సమయంలో ఏం చేయాలి తూ.చ. తప్పకుండా పాటించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రేయినర్లు శ్రీరామ్, మదన్ గోపాల్ లు పవర్ పాయిట్ ప్రజంటేషన్ ద్వారా అధికారుల విధులు, భాధ్యతలపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా సంక్షేమ అధికారిణి సుమ, తహశీల్దార్లు, సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS