గండిపేట పార్కును ప్రారంభించ‌నున్న మంత్రి

Spread the love

గండిపేట పార్కును ప్రారంభించ‌నున్న మంత్రి కేటీఆర్.

హైద‌రాబాద్ : జంట జలాశయాల్లో ఒకటైన గండిపేట తీరానికి కొత్తందాలు జోడయ్యాయి. పర్యాటకులకు కనువిందు చేసేలా 18 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ రూ.35.6 కోట్లు వెచ్చించి సర్వాంగ సుందరంగా నందనవనాన్ని నిర్మించింది. ఈ పార్కును మంగళవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తున్నారు. ఫ్లవర్‌ టెర్రస్‌, పిక్‌నిక్‌ స్పెసెస్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, ఆర్ట్‌ పెవిలియన్‌ వంటి ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ఈ పార్కుతో గండిపేట తీర ప్రాంతమంతా.. అద్భుత పర్యాటక కేంద్రంగా మారిపోనున్నది. అలాగే కొత్వాల్‌గూడలో 80 ఎకరాల్లో నిర్మించే ఎకో పార్కు నిర్మాణ పనులకు కూడా మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

ఐటీ కారిడార్‌లో జంట జలాశయాల్లో ఒకటైన గండిపేట తీరంలో అత్యాధునిక డిజైన్లతో నిర్మించిన పార్కును మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ.రామారావు ప్రారంభించనున్నారు. వినూత్న డిజైన్లను ఎంపిక చేసి, రూ.36 కోట్లతో గండిపేట పార్కును హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నిర్మించింది. నగరంలో ఐటీ కారిడార్‌ శరవేగంగా విస్తరిస్తున్న పడమర దిక్కున గండిపేట జలాశయం పర్యాటక కేంద్రంగా ఉంది. చారిత్రక నేపథ్యం ఉన్న గండిపేటను దృష్టిలో పెట్టుకొని స్వాగత ద్వారాన్ని అత్యంత భారీ ఆకృతిలో నిర్మించారు. అదేవిధంగా సెంట్రల్‌ పెవిలియన్‌, టికెటింగ్‌ కౌంటర్లు, ఎంట్రెన్స్‌ ప్లాజా, వాక్‌వేస్‌, ఆర్ట్‌ పెవిలియన్‌, ప్లవర్‌ టెర్రస్‌, పిక్‌నిక్‌ స్పేస్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, ఇన్నర్‌ యాక్సెస్‌ రోడ్డు, కిడ్స్‌ ప్లే ఏరియా, ఫుడ్‌ కోర్టులను అత్యంత ఆకట్టుకునేలా చేపట్టారు.

కొత్వాల్‌గూడలో ఎకో పార్కు..
గచ్చిబౌలి-శంషాబాద్‌ మార్గంలో ఔటర్‌ రింగు రోడ్డును అనుకొని ఉన్న సుమారు 80 ఎకరాల్లో ఎకో పార్కు నిర్మాణానికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రత్యేకంగా ప్రతిపాదనలు రూపొందించింది. ఔటర్‌ రింగు రోడ్డుకు ఇరువైపులా పెద్ద మొత్తంలో అందుబాటులో ఉన్న స్థలంలో గుట్టలు ఉండడంతో వాటిని తొలగించకుండా సహజ సిద్ధంగా ఉండేలా ఎకో పార్కును నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.టీ.రామారావు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు.

ఎకో పార్కుప్రత్యేకతలు
హిమాయత్‌సాగర్‌ సమీపంలో కొత్వాల్‌గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.75 కోట్ల వ్యయంతో 85 ఎకరాల్లో ఎకోపార్కును అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
2.5 కి.మీ పొడవు, 2.4 మీటర్ల వెడల్పుతో బోర్డు వాక్‌ను ఏర్పాటు చేయనున్నారు.
6 ఎకరాల్లో బర్డ్‌ ఏవియరీ ఏర్పాటు
2.5 కి.మీ పొడవు, 6 మీటర్ల వెడల్పుతో పాత్‌వేల నిర్మాణం.
అప్రోచ్‌ రోడ్డు, ఎంట్రన్స్‌ వద్ద పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు.
గెజెబోస్‌, పర్‌గూలాస్‌, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌, అక్వేరియం, ఫుడ్‌కోర్టు, రెస్టారెంట్స్‌ నిర్మాణం
బట్టర్‌ ఫ్లై గార్డెన్‌, సెన్‌సోరి పార్క్‌, గ్రీనరీ ల్యాండ్‌స్కేపింగ్‌, ఇన్ఫినిటీ పూల్‌, క్యాంపింగ్‌ టెంట్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్‌, లగ్జరీ వుడెన్‌ కాటేజెస్‌ వంటి నిర్మాణం చేపడతారు.
ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా భూములను కలుపుతూ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి.

Related Posts

You cannot copy content of this page