రాష్ట్రంలోని 1000 గ్రామాల్లో గంగదేవిపల్లి గ్రీన్‌ మోడల్‌: మంత్రి కేటీఆర్‌

Spread the love

సాక్షిత : దేశంలో మొట్టమొదటి గ్రీన్‌ బిల్డింగ్‌, గ్రీన్‌హోమ్‌, గ్రీన్‌ ఎయిర్‌పోర్టు లాంటివి గర్వకారణమని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర సచివాలయం, జిల్లా కలెక్టరేట్లను గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌లో నిర్మించామని ఆయన చెప్పారు. గ్రీన్‌బిల్డింగ్‌ కౌన్సిల్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన గ్రీన్‌ ప్రాపర్టీ షోను ప్రారంభించి, మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక హరితహారంతో తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ 33 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు.

ఇంకా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం తరపున CII-IGBCకి పూర్తి సహకారం అందిస్తాం. రాష్ట్రంలో గ్రీన్ బిల్డింగ్ అనేక రికార్డులను కలిగి ఉంది. భారతదేశపు మొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ హోమ్, గ్రీన్ ఎయిర్‌పోర్ట్, గ్రీన్ రైల్వే స్టేషన్, గ్రీన్ ఫ్యాక్టరీ ఇలా ఇవన్నీ గ్రీన్ బిల్డింగ్ విజయాలు. ఈ గ్రీన్ బిల్డింగ్ వల్ల దేశంలో గ్రీన్ ఇండ్లు పెరుగుతున్నాయి. CII-IGBC హైదరాబాద్‌లో 10.27 బిలియన్ చదరపు అడుగుల్లో నిర్మాణాలు పూర్తిచేసింది’ అని చెప్పారు.

కొత్త సచివాలయ భవనం, టీ-హబ్, టీ-వర్క్స్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త కలెక్టరేట్ భవనాలు, ఆస్పత్రులు, హెల్త్‌కేర్ క్యాంపస్‌లు, ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ టవర్లలో గ్రీనరీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా తెలంగాణ పచ్చని బాటలో నడుస్తోందని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. భవనాలు, క్యాంపస్‌లు మాత్రమే కాకుండా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో IGBC ద్వారా గ్రీన్ సిటీస్ రేటింగ్‌ పెరుగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణకు హరిత హారం ద్వారా రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 24% నుంచి 33% శాతం వరకు పచ్చదనం పెరిగిందని మంత్రి చెప్పారు. చెట్ల విస్తరణను గణనీయంగా పెంచుకున్నామని, దాంతో రాష్ట్రం మొత్తం పచ్చదనం పెరిగిందని తెలిపారు. నగరాలేగాక రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో కూడా గ్రీన్ బిల్డింగ్ సూత్రాలను అవలంభించాలని కోరుకుంటున్నామని చెప్పారు. గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను గ్రీన్‌ విలేజెస్‌గా మార్చేందుకు IGBC సహకారం కావాలన్నారు.

గ్రామీణ విద్యుదీకరణ, పారిశుద్ధ్య సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, మున్సిపల్ వ్యర్థాల నిర్వహణను మెరుగుపర్చడానికి, గ్రామాలు పచ్చగా మారడానికి వీలుగా పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పనపై తాము దృష్టి పెడుతున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, సీఐఐ తెలంగాణ చైర్మన్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page