వచ్చే నెల 16 వ తేదీన జరిగే ఓల్డ్ సిటీ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 250 కోట్ల రూపాయల వ్యయం

Spread the love

సాక్షిత ; వచ్చే నెల 16 వ తేదీన జరిగే ఓల్డ్ సిటీ ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం 250 కోట్ల రూపాయల వ్యయంతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సాలార్జంగ్ మ్యూజియంలో ఓల్డ్ సిటీ బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఎన్నో సంవత్సరాల నుండి గత ప్రభుత్వాలకు విన్నవిస్తున్నా పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని, నాటి నుండి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఘనంగా నిర్వహిస్తూ వస్తుందని వివరించారు. గొప్పగా బోనాల ఉత్సవాలను జరుపుకోవాలనే ఉద్దేశంతో వివిధ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు గాను ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని వివరించారు. ప్రైవేట్ దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణా మాత్రమేనని చెప్పారు. బోనాల ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగేలా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం CC కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇతర జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రప్పించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా భక్తులు, వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని అన్నారు. వివిధ ఆలయాల వద్ద భక్తుల తోపులాటలు జరగకుండా భారికేడ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా అదనపు ట్రాన్స్ ఫార్మర్ లు, జనరేటర్ లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. భక్తులకు త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆలయాల వద్ద ఎక్కడా సీవరేజ్ లీకేజీ లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్ధం RTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని అన్నారు. రహదారుల మరమ్మతులు, వాటర్, సీవరేజ్ లైన్ వంటి అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే వచ్చే నెల 13 వ తేదీ లోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆలయ పరిసరాలు, కాలనీలు, రోడ్లపై ఎక్కడా చెత్త లేకుండా తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నిరంతర పారిశుధ్య నిర్వహణ కోసం అదనపు శానిటేషన్ సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. అన్ని ప్రాంతాలలో స్ట్రీట్ లైట్ లు వెలిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్కన్న మాదన్న, సబ్జిమండి ఆలయాలకు అమ్మవార్ల ఊరేగింపు కోసం అంబారి (ఏనుగు) ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. వివిధ ప్రాంతాలలోని ప్రజలు TV లలో వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 17 వ తేదీన అక్కన్న మాదన్న దేవాలయం నుండి డిల్లీ దర్వాజ వరకు నిర్వహించే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కు కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఊరేగింపు ను కొంచెం త్వరగా ప్రారంభించాలని నిర్వాహకులను మంత్రి కోరారు. క్రిందకు వేలాడుతూ ఉండే విద్యుత్ తీగలను తొలగించాలని, అవసరమైన చోట్ల రోడ్ల మరమ్మతులు చేపట్టాలని అన్నారు. దమయంతి భవన్, డిల్లీ దర్వాజ ల వద్ద త్రీడీ మ్యాపింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నే దేశ రాజధాని డిల్లీ, విజయవాడ లలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలను నిర్వహించడం జరిగిందని వివరించారు. ప్రజలు సంతోషంగా ఉండాలి….పండుగలను గొప్పగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి కె సి ఆర్ ఆలోచన అన్నారు. మన పండుగలు ఎంతో గొప్పవని, విశ్వవ్యాప్తంగా బోనాలు, బతుకమ్మ వంటి పండుగలను జరుపుకోవడం మనందరికీ గర్వకారణం అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సమావేశంలో బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్, ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ ఆలె భాస్కర్ రాజ్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, RDO వెంకటేశ్వర్లు, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, సౌత్ జోన్ DCP సాయి చైతన్య, ట్రాఫిక్ DCP అశోక్ కుమార్, ఆర్ అండ్ బి SE హఫీజుద్దిన్, టూరిజం MD మనోహర్, ట్రాన్స్ కో SE అబ్దుల్ రహమాన్, వివిధ దేవాలయాల కమిటీ ప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page