మంత్రివర్గంలో ఎవరెవరు?.. కొత్త ప్రభుత్వ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి

Spread the love

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించటంతో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ రెండో సీఎం ఎవరు అవుతారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుంది? అనే అంశాలపై జోరుగా ఊహాగానా లు, చర్చలు మొదలయ్యాయి. ఏ జిల్లా నుంచి ఎవరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందనే అంచనాల్లో ప్రజలు మునిగితేలుతున్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకున్న వారందరికీ కొత్త మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందనే వాదన బలంగా వినపడుతున్నది. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని భావిస్తున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు వారి సామాజిక వర్గాల నుంచి అవకాశం దక్కుతుందని తెలుస్తున్నది. మహిళ, ఎస్టీ, బీసీ కోటాల నుంచి ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క), వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖలకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ సాగుతున్నది. బ్రాహ్మణ వర్గం నుంచి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అవకాశం దక్కవచ్చని సమాచారం.

అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఎస్సీ కోటాలో జీ వివేక్‌ వెంకటస్వామికి కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నుంచి గెలుపొందిన సుదర్శన్‌రెడ్డి, బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే చర్చ సాగుతున్నది. సీనియర్లు, విద్యావంతులను స్పీకర్‌గానో, డిప్యూటీ స్పీకర్‌గానో నియమించాల్సి వస్తే.. సుదర్శన్‌రెడ్డికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనితోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి మరొకరికి మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశం ఉంటే కొల్లాపూర్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు వెలమ సామాజిక వర్గం నుంచి అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇక సీఎం అభ్యర్థులుగా ప్రచారం పొందిన వారిలో ఒకరిద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశం ఉన్నదని కూడా కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీనియర్‌ నేత, మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనర్సింహకు అవకాశం దక్కొచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ కోటాను మరింతగా విస్తరించాలని భావిస్తే రజక సామాజిక వర్గానికి చెందిన శంకరయ్య పేరును పరిశీలించే అవకాశం ఉన్నదని చర్చ సాగుతున్నది.

హైదరాబాద్‌, రంగారెడ్డి పరిధిలో (జీహెచ్‌ఎంసీ) కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వచ్చినా.. ఇక్కడ ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తే.. వీర్లపల్లి శంకర్ కు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 9న సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలోనే పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ లోపుగానే మంత్రివర్గంలో ఉండేవారి పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నది..

Whatsapp Image 2023 12 04 At 12.08.57 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page