ప్రభుత్వం కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తుంది – జిట్ట నగేష్

Spread the love

ప్రభుత్వం కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తుంది – జిట్ట నగేష్

— ప్రభుత్వ పథకాలను కౌలు రైతులకు వర్తింపచేయాలి

చిట్యాల సాక్షిత ప్రతినిధి

ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ,రెగ్యులర్ రైతులకు ఇచ్చే సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. చిట్యాల తహశీల్దార్ శ్రీనివాస్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రైతులందరికీ విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలని కోరారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ధరణి వెబ్ సైట్ వల్ల 20 రకాల సమస్యలు పెండింగ్ లో ఉండి, సకాలంలో పట్టాదారు పాస్ పుస్తకాలు రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిలోని అవకతవకలను వెంటనే సరి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఐతరాజు నర్సింహా వివిధ ప్రజా సంఘాల నాయకులు పామనుగుల అచ్చాలు, నారబోయిన శ్రీనివాసులు ,రుద్రారపు పెద్దలు, పల్లపు పెంటయ్య ఇద్దయ్య, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page