SAKSHITHA NEWS

Farmers need not worry about seeds required for monsoon cultivation

వర్షాకాలం సాగుకు అవసరమైన విత్తనాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…….. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ *

సాక్షిత వనపర్తి మే 31   వర్షాకాలం సాగుకు అవసరమైన నాణ్యమైన పత్తి, వరి విత్తనాలు డీలర్ల దగ్గర అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్‌ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.

శుక్రవారం కొత్తకోట మండలకేంద్రంలోని మన గ్రోమోర్, ఆత్మకూరు మండల కేంద్రంలోని అగ్రి రైతు సేవ కేంద్రం, జై కిసాన్ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ దుకాణాల్లో విత్తనాలు, ఎరువుల నిల్వలు, అమ్ముడు అయిన వాటి రికార్డులను పరిశీలించారు. ఎక్కువగా ఏ బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉంది అని అడిగి తెలుసుకున్నారు. 

   జిల్లాలో వర్షాకాలం పత్తి సాగుకు సరిపడా నాణ్యమైన పత్తి, వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. జిల్లాకు 14,350 పత్తి విత్తనాల పాకెట్స్ రాగా, అందులో ఇప్పటివరకు కేవలం 2,512 అమ్ముడయ్యాయని తెలిపారు. విత్తనాలకు సంబంధించి ఎక్కడైనా కొరత ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్ 08545 233525 కి కాల్ చేయమని సూచించారు. కంట్రోల్ రూమ్ లో స్టాక్ పోసిషన్ వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు.

  విత్తనాల విషయంలో రైతులను మోసం చేసే ఘటనలు చోటుచేసుకోకుండా మండలాల వారీగా తనిఖీ వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీ లు చేసి నాసిరకం విత్తనాలు అమ్మే వారిని గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. ఎవరైనా నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. లేబుల్, పాకింగ్ లేని విత్తనాలు అమ్మకూడదని అన్నారు.  ఇకపోతే ఫర్టిలైజర్స్ కు సంబందించి కూడా సరిపడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

ప్రభుత్వ బడుల్లో మరమ్మత్తుల పరిశీలన
ప్రభుత్వ బడుల్లో పిల్లలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఆత్మకూరు మండలకేంద్రంలోని వడ్డెగేరి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జడ్పీ హెచ్ఎస్ ఉర్దూ పాఠశాల ను సందర్శించారు.

బడుల్లో మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పనుల నిర్వహణలో ఎక్కడా అలసత్వానికి తావివ్వకూడదని తెలిపారు. తాగునీటి వసతి, వంట గది, మరుగుదొడ్లు సహా అన్ని పక్కాగా ఉండేలా మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.

జిల్లా వ్యవసాయ అధికారి డి చంద్రశేఖర్, కొత్తకోట ఏడిఏ దామోదర్, ఆత్మకూరు తహసీల్దార్ రాజు, ఎం.ఈ.ఓ భాస్కర్, ఎం.పీ.ఓ నర్సింగ్ రావు, ఎం.పీ.డి.ఓ సుజాత, ఏ.ఈ.ఓ మహేశ్వరి, ఇంజనీరింగ్ సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app


Farmers need not worry about seeds required for monsoon cultivation

SAKSHITHA NEWS