అమ్ముడుపోయిన వారికి ఓట్లు వేయొద్దు: రేవంత్ రెడ్డి

Spread the love

అమ్ముడుపోయిన వారికి ఓట్లు వేయొద్దు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

మనుగోడు: కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.రాజీనామా చేస్తే ఎక్కడైనా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. రాజగోపాల్‌ రెడ్డిని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. దాన్ని ఆయన రూ.22 వేల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓటేయొద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మునుగోడులో పార్టీ నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
మునుగోడులో 97వేల ఓట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆస్తి అని రేవంత్‌ రెడ్డి అన్నారు. అందరం కలిసి పనిచేస్తే ఎవర్నైనా పడగొట్టచ్చని చెప్పారు. మండల స్థాయి నాయకులు రోజుకు రెండు గంటలు సమయం కేటాయిస్తే విజయం కాంగ్రెస్‌దేనని విశ్వాసం వ్యక్తంచేశారు. రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ అన్ని అవకాశాలూ కల్పిస్తే.. ఆయన వేరే పార్టీకి అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని భాజపా చూస్తోందన్నారు. అపారమైన అనుభవం కలిగిన జానారెడ్డి, దామోదర్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, వెంకట్‌రెడ్డి సలహాతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.
సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ రాష్ట్ర విలీన కార్యక్రమాలను స్వాతంత్య్ర ఉత్సవాలతో సమానంగా నిర్వహించాలని రేవంత్‌రెడ్డి అన్నారు. సాయుధపోరాటంలో నల్గొండకు చెందిన అనేక మంది సమిధలయ్యారని గుర్తు చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి 2023 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని, ఇందుకోసం రూ.5వేల కోట్లు కేంద్రం కేటాయించాలన్నారు. గడిచిన 8 ఏళ్లుగా సెప్టెంబర్‌ 17ను ఎందుకు నిర్వహించలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు

Related Posts

You cannot copy content of this page