SAKSHITHA NEWS

జోగుళాంబ గద్వాల్ జిల్లా లో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఎస్పీ శ్రీమతి కె.సృజన ఆదేశించారు.
జిల్లా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తగిన ఏర్పాట్లతో చేపట్టవలసిన చర్యల గురించి పలు ఆదేశాలు జరిచేయడం జరిగింది. అలాగే ప్రజలు కూడా గ్రామాలలో/ పట్టణాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో ఉన్న నివాసలలో ఉండే వారు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
వర్షాల దృష్ట్యా 24 గంటల పాటు పెట్రో, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తూ ప్రజలను మరింత అప్రమత్తం చేయాలని, వాగుల తీరా గ్రామాలలో, చెరువు అలుగుల వద్ద పెద్దలు తమ పిల్లలను వాగులలోకి, అలుగుల వద్దకు వెళ్లకుండా చూడాలని, నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని, వర్షాల దృష్ట్యా పోలీసు అధికారులు సిబ్బంది తమ వెంట రోప్స్, టార్చ్ లైట్స్, ట్యూబ్స్, లైవ్ జాకెట్స్ వెంటఉంచుకోవాలని ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎస్పీ పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు.
ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వర్షాల వల్ల కలిగే ప్రమాదాల పై ప్రజలను జాగృతం చేయాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్,హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సంబంధిత గ్రామాల సర్పంచ్ లను, మరియు ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల సర్పంచులు మరియు ప్రజా ప్రతినిధులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకొని ప్రమాద నివారణ చర్యలను చేపట్టడానికి సిద్దంగా వుండాలని గ్రామ పోలీసు అధికారులకు సూచించారు. పట్టణాలలో గ్రామాలలో మట్టితో కట్టిన పురాతన ఇండ్లను, నాలలకు దగ్గరగా ఉన్న ఇండ్లను గురించి ముందస్తు సమాచారం తెలుసుకుని, ఇండ్లు కూలే ప్రమాదంలో ఉంటే సంబంధిత పంచాయతీ, రెవెన్యూ అధికారుల సహకారంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు వాగులు నదులు ఉదృతిని అంచనా వేస్తూ వరద ముంపుకు గురయ్యే గ్రామాలలో టామ్ టామ్ వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.
వర్షాలలో విద్యుత్ స్థంబాలకు ఎర్థింగ్ ద్వారా విధ్యుత్ సరఫరా అయ్యి కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉందని జిల్లా ప్రజలు పిల్లలు ఎవరు కూడా విద్యుత్ స్థంబాలను కానీ విద్యుత్ పరికరాలను ముట్టుకోకుండా వారిని జాగృతం చేయాలని,అలాగే విధ్యుత్ సరఫరాలో ఏదైనా లోపం ఉంటే వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. బారి వర్షాల వల్ల ఏదైనా విపత్కర సమస్య వస్తే లోకల్ పోలీస్ అధికారులకు లేదా డయల్- 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ , 87126 70306 నెంబర్లకు సమాచారం అందించినచో తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతామని జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లా ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి.
బారి వర్షాలు పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు.
1) వర్షానికి తడిసిన విద్యుత్ స్థంబాలను, గోడలను తాకరాదు, వాటికి కరెంట్ షాక్ వచ్చి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
2) ఇనుప వైర్ లపై గృహిణి లు బట్టలు ఆరవేయరాదు కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది.
3) ఇంటి పై కప్పుగా వేసిన ఇనుప రేకులను తాకరాదు.
4) శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ,మట్టీ గోడలు తో ఉన్న ఇళ్ళలో, ఉదృతంగా ప్రవహించే నాలల దగ్గర ఉండే నివాసలలో ఉండకండి,అవి ఊహించని విధంగా కూలిపోయి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
5) రైతులు మీ వ్యవసాయ బావుల వద్ద ,బోర్ ల వద్ద కరెంట్ పెట్టె ముందు తడిసిన స్టార్టర్ బాక్స్ లను,ఫ్యుజ్ బాక్స్ లను చేతులతో ముట్టుకోరాదు.
6) వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.
7) చిన్నపిల్లలు మరియు ఈత రానివారు ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువు లోకి ఈత కు గాని లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. తల్లిదండ్రులు పిల్లలను బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
8) వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి. వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.
9) వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయకండి.
ప్రజలందరూ ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ విష వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా మరియు ఆరోగ్యం గా ఉండాలని అన్నారు.


SAKSHITHA NEWS