ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలని, పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పి (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్) లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, చింతకాని మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు చేపడుతున్న డిజిటల్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 3, కస్తూరిబా బాలికల విద్యాలయాలకు 6 చొప్పున, ఉన్నత ప్రాధమికొన్నత పాఠశాలలకు ఒకటి చొప్పున ఐఎఫ్పి లను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠాల బోధన, డిజిటల్ తరగతుల ద్వారా సులభంగా అర్థం అవుతుందని, ఉపాధ్యాయులకు బోధన కూడా సులువు అవుతుందని ఆయన తెలిపారు. అంతకుముందు కలెక్టర్, పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి, పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో మౌళిక సదుపాయాలకల్పన ను తనిఖీ చేశారు. పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల రవాణా పకడ్బందీగా చేయాలని అధికారులను సూచించారు.
ఈ సందర్భంగా పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, చింతకాని మండల తహసీల్దార్ రమేష్, ఎంపిడివో రామయ్య, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు ఉన్నారు.