SAKSHITHA NEWS

హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ : పవన్ కల్యాణ్

హైడ్రా విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంం సరైనదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో హైడ్రాను ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి మంచి పనిచేశారని తెలిపారు. హైదరాబాద్ లోని చెరువుల్లో ఇళ్లు కడుతుంటే తనకు ఎంతో బాధేసేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ వాటిని తొలిగించడం సంతోషంగా ఉందని తెలిపారు.

ముందుగానే అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. హైడ్రాలాంటివి కచ్చితంగా ఉండాలని చెప్పారు పవన్. ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చేయాలన్నారు. తెలంగాణలో మరో ప్రభుత్వం వచ్చినా అడ్డగోలుగా కట్టకుండా.. బ్యూరోక్రసీని కట్టుదిట్టం చేయాలని చెప్పారు పవన్. ఇక తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి పవన్ కల్యాణ్ రూ. కోటి విరాళంగా ప్రకటించారు. దీనిని తానే స్వయంగా సీఎం రేవంత్ కు అందజేస్తానని చెప్పారు. కష్టాలు వచ్చినప్పుడు ఒకరినొకరు అండగా నిలబడాలని వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలని కోరారు పవన్. కాగా అంతకుముందు ఏపీకి పవన్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు.


SAKSHITHA NEWS