SAKSHITHA NEWS

మొబైల్ ఫోన్ లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలో మనకు తెలియకుండా నిక్షిప్తమైన వైరస్ ను గుర్తించడానికి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో “దిశ సైబర్ కవచ్” అను సరికొత్త పరికరాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.
“దిశ సైబర్ కవచ్” తో సైబర్ మోసాలు కట్టడి చెయ్యవచ్చు.
జిల్లా ప్రజలు “దిశ సైబర్ కవచ్” సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్.

సైబర్ మోసాలను కట్టడి చెయ్యడానికి “దిశ సైబర్ కవచ్” సాఫ్ట్‌వేర్‌ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వారిని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా రక్షించే విధంగా ఏర్పాటు చేసిన “దిశ సైబర్ కవచ్” మానిటర్ ను జిల్లా ఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం “దిశ సైబర్ కవచ్” పని చేస్తున్న విధానాన్ని తెలుసుకొని, మొబైల్ లోని యాప్ లను, డాటాను స్కాన్ చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు.


జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన “దిశ సైబర్ కవచ్” సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను “దిశ సైబర్ కవచ్” మానిటర్ కు అనుసంధానం చేస్తే వాటిని స్కాన్ చేసి అందులో ఉన్న వైరస్, సైబర్ మాల్‌వేర్‌ తో పాటు మనకు తెలియకుండా ఇన్స్టాల్ అయిన యాప్ లను కూడా గుర్తిస్తుందన్నారు. తద్వారా సులభంగా వాటిని తొలగించవచ్చునని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం యాప్‌లు, వైరస్‌, మాల్‌వేర్‌ను గుర్తించి, తొలగించేందుకు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందిని ఎస్పీ పేర్కొన్నారు. మొబైల్ ఛార్జింగ్‌ పిన్‌ నుంచి యూఎస్‌బీ కేబుల్‌ ద్వారా “దిశ సైబర్ కవచ్” మెషిన్‌కు అనుసంధానం చేస్తే.. ఆ మొబైల్‌లో ఉన్న సమాచారాన్ని బట్టి మనకు తెలియకుండా ఇన్ స్టాల్ అయిన యాప్‌లు, సాఫ్ట్‌వేర్‌లను, వైరస్‌ను గుర్తిస్తుందన్నారు.

ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరిగిపోయిందని, మొబైల్ ఫోన్ ల వలన ప్రపంచంలోని సమగ్ర సమాచారం మన అరచేతిలోనే మనముందు ఉంటుందన్నారు. మన అవసరాలను ఆసరాగా చేసుకొని ఇటీవల సైబర్ మోసాలు పెరిగిపోయాయి అన్నారు. సైబర్ మోసగాళ్ళు వివిధ లింకుల ద్వారా వైరస్, సైబర్ మాల్‌వేర్‌ లను మన మొబైల్ లలోకి పంపి మన వ్యక్తిగత సమాచారం దొంగిలించి ఆర్ధిక పరమైన వివిధ రకాలైన నేరాలకు పాల్పడుతున్నారన్నారు.

“దిశ సైబర్ కవచ్” వలన ఇలాంటి సైబర్‌ మోసాలకు గురికాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా వచ్చి “దిశ సైబర్ కవచ్” మెషిన్‌కు వారి ఫోన్‌ను అనుసంధానం చేసుకొని వైరస్‌ను, సైబర్ మాల్వార్ లను డిలీట్‌ చేసుకోవచ్చునన్నారు. ఈ మెషిన్ దగ్గర సహాయంగా ఉండేందుకు శిక్షణ పొందిన పోలీస్ సిబ్బందిని నియమిస్తామన్నారు. “దిశ సైబర్‌ కవచ్‌” చూడటానికి ఏటీఎం మిషన్‌ తరహాలో ఉంటుందన్నారు. ఈ “దిశ సైబర్ కవచ్” మెషిన్‌ ద్వారా ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించబడదని ఎస్పీ స్పష్టం చేశారు.


SAKSHITHA NEWS