SAKSHITHA NEWS

అటవీ అమరవీరుల త్యాగం వెల కట్టలేనిది : ఎమ్మెల్యే

అటవీ అమరవీరుల త్యాగం వెల కట్టలేనిది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, అటవీ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి అమరులైన అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అడవులు ఉంటేనే మానవ జీవనానికి ఎలాంటి ముప్పు ఉండదని, ప్రకృతిని ప్రేమించడమే కాకుండా ఆరాధిస్తున్న అటవీ సిబ్బంది ఎంతో గొప్ప వారని, వారికి అడవితో గల సంబంధం విడదీయరానిదని ఆయన స్పష్టం చేశారు.

మానవ మనుగడకు కీలకం గా ఉన్న మూడు వనరులను కాపాడుకోవాలని అవి జల జలవనరులు, అటవీ వనరులు మానవ వనరులని ఆయన అన్నారు . జల వనరుల రక్షణలో భాగంగా ఈమధ్యనే తెలంగాణ వ్యాప్తంగా చెరువులను , కుంటలను కాపాడే ప్రయత్నం ప్రజా ప్రభుత్వం చేస్తుందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా అడవులు కూడా కుంచించుకు పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను నమ్మి బ్రతుకుతున్న జాతుల వారిని కూడా మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అడవులకు నష్టం జరుగకుండా, అడవులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారికి ఇబ్బందులు లేకుండా మనం ప్రయత్నించాలని ఆయన చెప్పారు. అనంతరం ఫారెస్ట్ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ గారితో కలిసి మొక్కలు నాటారు. రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్త దాన శిభిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, అడిషనల్ ఎస్పీ రాములు, డిఎఫ్ఓ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మరియు అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS