SAKSHITHA NEWS

Party lost with Venkat Reddy's covert politics: Palvai Sravanti

వెంకట్‌రెడ్డి కోవర్టు రాజకీయాలతో పార్టీకి నష్టం: పాల్వాయి స్రవంతి


సాక్షిత మునుగోడు(చండూరు ): తెరాస ధన, అంగ బలాలతో మద్యాన్ని ఏరులై పారించి మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిందని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు.

నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ గ్రామంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలో తెరాస, భాజపాలు రూ.500 కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. డబ్బు, మద్యం పంపిణీ గురించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు.

తాను సీఎం కేసీఆర్‌ను కలిసినట్లుగా మార్ఫింగ్‌ ఫొటోలతో తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లలో సైతం ఇలాగే నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోవర్టు రాజకీయాలు పార్టీకి నష్టం చేశాయని పేర్కొన్నారు.

ఆయన విషయం పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. ఎన్నికలో ప్రలోభాల తీరు చూస్తుంటే కొత్తగా ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌నేత, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS