పుష్ప సినిమా తలపించేలా… అంత కంటే కొత్త తరహాలో గంజాయి తరలింపు

Spread the love

పుష్ప సినిమా తలపించేలా… అంత కంటే కొత్త తరహాలో గంజాయి తరలింపు

వాహనం కింది భాగం ఖాళీ ప్రదేశంలో సరకు సంచులు

హైదరాబాద్:- పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చౌటుప్పల్‌ పోలీసులు రట్టుచేశారు.

నలుగురిని అరెస్టు చేసి 400 కిలోలు స్వాధీనం చేసుకున్నారు.

శనివారం ఎల్బీనగర్‌లో విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్‌చౌహాన్‌ వివరాలు వెల్లడించారు.

హనుమకొండకు చెందిన బానోత్‌ వీరన్న, హైదరాబాద్‌ వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్‌ శంకర్‌ నాయక్‌, వరంగల్‌కు చెందిన పంజా సూరయ్య ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమల్‌గిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్‌ మీదుగా హైదరాబాద్‌, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు.

డీసీఎం వాహనం లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించి అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారు.

దానిపై ఇనుప షీట్లు ఉంచి బోల్టులతో బిగిస్తున్నారు.

ఆపై ఏదో ఓ లోడును తీసుకుని నగరానికి పయనమవుతున్నారు.

ఇలా ఆరుసార్లు గుట్టుగా గంజాయిని అనుకున్నచోటుకు తరలించారు.

ఏడోసారి దొరికిపోయారు…
వాహనంలో గంజాయి తరలుతోందని చౌటుప్పల్‌ పోలీసులకు ఉప్పందింది.

డీసీఎంకు ముందు ఓ హ్యుందాయ్‌ క్రెటా కారును పైలట్‌లా పంపిస్తూ.. జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందింది.

శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చౌటుప్పల్‌ లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు.

పైలట్‌గా వచ్చిన కారును అడ్డుకుని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపారు.

అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్నిచూడగా శబ్దంలో తేడా వచ్చింది.

ఇనుపషీట్లపై బోల్టులు తొలగించడంతో 400కిలోల గంజాయి ఉంది.

కారులో వచ్చిన ఇద్దరితోపాటు డీసీఎంలో వెళ్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page