తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా నియమితులైన దీటి మల్లయ్య గంగపుత్ర

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య వైస్ చైర్మన్ గా నియమితులైన దీటి మల్లయ్య గంగపుత్ర రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ గా పిట్టల రవిందర్ ముదిరాజ్ ను, వైస్ చైర్మన్ గా దీటి మల్లయ్య గంగ పుత్రలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. వీరిలో చైర్మన్ గా పిట్టల రవిందర్ ముదిరాజ్ బాధ్యతలను చేపట్టగా, వైస్ చైర్మన్ గా మల్లయ్య గంగపుత్ర ఆగస్టు 25 వ తేదీన బాధ్యతలను చేపడతారు.

ప్రమాణ స్వీకారం కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని అక్కడే ఉన్న మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా లను మంత్రి ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావానికి ముందు తెలంగాణ ప్రాంతంలో మత్స్యరంగం పూర్తి నిరాదరణ కు గురైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని, ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని చెప్పారు.

మత్స్యకారులకు అదనపు ఆదాయ వనరుగా మారాలనే ఆలోచనతోనే ఉచితంగా రొయ్య పిల్లలను కూడా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కూడా చెరువులపై మత్స్యకారులకు పూర్తి హక్కులు కల్పించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. రానున్న రోజులలో ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం అభివృద్దిని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మత్స్యకారులు చేపలను అమ్ముకొనే విధంగా అన్ని సౌకర్యాలతో కూడిన మార్కెట్ ల నిర్మాణం కూడా చేపట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా సబ్సిడీ పై మొబైల్ ఫిష్ అవుట్ లెట్ లను కూడా అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్క మత్స్యకారుడికి అందించాలనే లక్ష్యంతోనే నూతనంగా లక్ష మందికి మత్స్య సోసైటీలలో సభ్యత్వం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఎన్నో సంవత్సరాలుగా వివిధ మత్స్య సొసైటీల పరిధిలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి తనను వైస్ చైర్మన్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు మల్లయ్య గంగపుత్ర కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page