SAKSHITHA NEWS

ప్లాస్టిక్ బ్యానర్ల నిషేధం” శుభపరిణామం – కాంగ్రెస్ రాష్ట్ర నేత నవీన్ కుమార్ రెడ్డి
సాక్షిత, తిరుపతి బ్యూరో: రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లు నిషేధిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ పీ.నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం పిలుపు మేరకు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరారు. సీఎం నినాదంతో నగరంలో వైసీపీ అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్లను వెంటనే స్వచ్ఛందంగా తొలగించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు కారణంగా ఉన్నఫలంగా “ప్లాస్టిక్” బ్యానర్లను నిషేధిస్తూ “క్లాత్” బ్యానర్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ నిషేధం తో పాటు “మద్యం” సేవించే వారి ఆరోగ్యాన్ని, వారి కుటుంబాన్ని పరిగణలోకి తీసుకొని “ప్రభుత్వ మద్యం షాపులను” వెంటనే పూర్తిగా బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. “ప్లాస్టిక్” వినియోగం కారణంగా పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో అలాగే మద్యం కు బానిసైన ఓ వ్యక్తి కారణంగా ఆ కుటుంబం మొత్తం చిన్నాభిన్నమై పెద్ద దిక్కును కోల్పోయి రోడ్ల పాలవడం, మద్యం మత్తులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం, మారణాయుధాలతో రక్తసంబంధీకులపై, కుటుంబ సభ్యులపై దాడులు చేయడం అత్యంత ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు.
ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ వార్మింగ్ పదేపదే హెచ్చరిస్తున్నారని గుర్తు చేశారు. ఏపీలో నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక “బ్యాంకు” లోన్ లు తీసుకొని ప్లాస్టిక్ బ్యానర్లు తయారు చేసే చిన్నపాటి కుటీర పరిశ్రమల ద్వారా జీవనం సాగిస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం “ఉపాధి” కల్పించిన తర్వాత అంచలంచేలుగా ప్లాస్టిక్ బ్యానర్ లను నిషేధించేలా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలని నవీన్ సూచించారు. రాజకీయ నాయకుల అత్యుత్సాహం కారణంగా స్వాగతం, అభినందనలతో ఏర్పాటు చేస్తున్న ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల వినియోగం పరిధి దాటిపోవడంతో ప్రజలకు ఇబ్బంది కరంగా మారిందన్నారు. వీరికి తోడుగా పుట్టినరోజులకు శుభాకాంక్షలు తెలుపుతూ, చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎక్కడ చూసినా ప్రధాన కూడళ్ళతో పాటు చిన్న గల్లీలలో సైతం ప్లాస్టిక్ ఫ్లెక్సీలు అధికమయ్యాయన్నారు.
చెరువులలో, కాలువలలో ప్లాస్టిక్ కవర్లు, బాటిల్లు బ్యాగులు ఇతరత్రా పడేయడం కారణంగా నీరు కలుషితమై చెరువులోని జీవరాశులు, మూగజీవాలు నిర్వీర్యం అవుతున్నాయని పేర్కొన్నారు. ఇదే నేపథ్యంలో త్వరలో నిర్వహించే
“వినాయక చవితి పండుగకు మట్టి విగ్రహాలనే పూజిస్తాం పర్యావరణాన్ని కాపాడుతాం” అనేలా ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు.


SAKSHITHA NEWS