SAKSHITHA NEWS

నమస్కారం, బాగున్నారా.. నేను మీ జిల్లా కలెక్టర్… ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా..

వ్యాపార పెట్టుబడి కోసం బ్యాంకు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తాం

సమస్యలు ఉంటే నేరుగా తనను కలెక్టరేట్ లో వచ్చి కలవాలి

నగరంలోనీ ఫుట్ వేర్ షాప్, ఆటో స్టాండ్ వద్ద ఆగి వివరాలు, సమస్యలు అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత:

నమస్కారం, బాగున్నారా, నేను మీ జిల్లా కలెక్టర్ ని, ఎలా నడుస్తున్నది వ్యాపారం, ఇక్కడి నుండి ఎక్కడి వరకు ఆటో నడుపుతారంటూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆటో డ్రైవర్ లు, ఫుట్ వేర్ యజమాని వద్దకు వెళ్లి వారితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఖమ్మం బస్ స్టాండ్ కు ఆనుకొని షాదీఖాన వెళ్ళే రోడ్డులో ఉన్న ఫుట్ వేర్ షాప్ లోకి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా వెళ్లి వ్యాపారం ఎలా నడుస్తున్నది, రోజువారీ సంపాదన, కుటుంబ పోషణ, పిల్లల చదువు నేపథ్యం మొదలగు వివరాలను షాప్ యజమాని సయ్యద్ బిలాల్ పాషా తో మాట్లాడి తెలుసుకున్నారు.
వ్యాపార నిమిత్తం చెప్పుల స్టాక్ ఎక్కడి నుండి తెస్తారు, దానికి పెట్టుబడి ఎలా వస్తుంది అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారాలు చేసే వారి కోసం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా, అలాగే ముద్ర పథకం ద్వారా తక్కువ వడ్డీతో పెట్టుబడి కోసం రుణాలు పొందవచ్చని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.


తర్వాత బస్టాండ్ సిగ్నల్ ప్రాంతం మూల మీద ఆగి ఉన్న ఆటో స్టాండ్ వద్దకు వెళ్లి ఆటో డ్రైవర్ లతో మాట్లాడారు. ఆటో డ్రైవర్ లు రోజుకు ఎంత సంపాదిస్తున్నారు, కుటుంబ పోషణకు సరిపోతున్నాయా, ఆటో సొంతందా , కిరాయికి తెచ్చుకున్నారా వంటి వివరాలు తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ గా మీరే మా వద్దకే వచ్చి మాకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడగడం చాలా సంతోషంగా ఉందని ఆటో డ్రైవర్ లు తెలిపి, ఖమ్మం నగరంలో 3 వేల వరకు ఆటోలు ఉంటాయని, ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఆటో అడ్డాలు పెంచాలని , వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ ను కోరారు.
ఖమ్మం జిల్లాలో పని చేసే మున్సిపల్ కార్మికులు, పంచాయతీ వర్కర్లకు ఇటీవల ఇన్సూరెన్స్ కల్పించామని, ఆటో డ్రైవర్ లు ప్రతి సంవత్సరం ఆర్.టి.ఓ. దగ్గర రెన్యువల్ చేసే సమయంలో కొంత మొత్తం చెల్లించడానికి ముందుకు వస్తే, ఆటో డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని, దీనిపై త్వరలో జిల్లా స్థాయి ఆటోల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో చర్చిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆటో అడ్డాల దగ్గర త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ అన్నారు. ఆటో డ్రైవర్ల పిల్లల చదువుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ లు మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో చదువు తున్నారని తెలుపగా, గురుకులాలలో, ప్రభుత్వ బడులలో పిల్లలు ఎలా చదువుతున్నారు, టీచర్లు జవాబుదారీ తనంతో ఉన్నారా, పేరెంట్ టీచర్స్ మీటింగ్ లకు హాజరవుతున్నారా వంటి వివరాలు కలెక్టర్ ఆరా తీశారు.


పేరెంట్ టీచర్స్ మీటింగ్ లకు రెగ్యులర్ గా హాజరు కావాలని, ప్రభుత్వ బడులలో ఏదైనా లోపాలు ఉంటే వెంటనే తెలియజేయాలని వాటిని సవరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పిల్లల చదువులపై శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యం ఎలా అందుతుంది, ఆటో డ్రైవర్లు వెళ్లినప్పుడు అవసరమైన మందులు ఇచ్చారా వంటి వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ లకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తనను కలెక్టరేట్ కు వచ్చి కలవాలని, సమస్యల పరిష్కారానికి వీలైనంతవరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.


SAKSHITHA NEWS