SAKSHITHA NEWS

శబరిమల:-శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి పోతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది.

దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపి వేస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఇలా చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఇక భక్తుల్ని నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై ఇప్పటికే పలుసార్లు లాఠీఛార్జ్ చేశారు. దీంతో కేళర ప్రభుత్వంపై, పోలీసులపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.

అయితే, అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్ట్ మెంట్లు అన్ని కిక్కిరిపోయాయి. స్వామి దర్శనం కోసం దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది. శబరిమల మార్గమధ్యలోనే భక్తుల్ని గంటల తరబడి పోలీసులు నిలిపివేస్తున్నారు. కానీ వేలాదిగా తరలి వస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు కూడా లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆలయ ట్రస్ట్ బోర్డు ట్రావెన్స్ కోర్ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి నిల్చుని ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. దాదాపు 10 గంటలకు పైగా భక్తులు మార్గ మధ్యలోనే నిల్చుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 2 కిలో మీటర్లకు పైగా క్యూలో అయ్యప్ప భక్తులు నిల్చున్నారు. భారీ క్యూ కారణంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొక్కిసలాట తర్వాత కూడా కేరళ ప్రభుత్వం, ట్రావెన్స్ కోర్ తీరు మారలేదని భక్తులు మండిపడుతున్నారు. అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అయ్యప్ప భక్తులు వాపోతున్నారు.


SAKSHITHA NEWS