గ్రామాల వారీగా తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలి…..

Sakshitha news

గ్రామాల వారీగా తాగునీటి సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలి…..

పైప్‌లైన్లు, అదనపు ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, కొత్త కనెక్షన్ల అవసరాలను గుర్తించాలి…

— కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : జిల్లాలో గ్రామాల వారీగా తాగునీటి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

ఐడీఓసీలో తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు, అవసరమైన పైప్‌లైన్లు, అదనపు ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, కొత్త తాగునీటి కనెక్షన్ల వివరాలను వెంటనే గుర్తించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు.

అందుబాటులో ఉన్న గ్రామపంచాయతీ నిధులను వినియోగించి అత్యవసరమైన చిన్నతరహా తాగునీటి పనులను వెంటనే చేపట్టాలని ఎంపీడీవోలను ఆదేశించారు. గ్రామాల వారీగా అవసరాలను గుర్తించి పనులకు ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో ప్రతిపాదించిన తాగునీటి పనులకు ప్రభుత్వ అనుమతులు, మంజూర్లు త్వరగా లభించేలా జెడ్పీ సీఈఓ నిరంతరం ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతిపాదిత పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.

ఓహెచ్‌ఎస్‌ఆర్‌లలో ఏర్పడే లీకేజీలు, పైప్‌లైన్ లీకేజీలు, చిన్నపాటి మరమ్మతులను పంచాయతీ నిధులతో తక్షణమే చేపట్టాలని తెలిపారు. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి, సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
గ్రామాల్లో భవిష్యత్ తాగునీటి అవసరాలను ముందుగానే గుర్తించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో జెడ్పీ సీఈఓ నరేందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర్ శ్రీనివాస్, అదనపు డీఆర్‌డీఏ అధికారి రవీందర్, సంబంధిత ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.