SAKSHITHA NEWS

సాక్షిత : విజయ డైరీ రైతులకు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వినాయకచవితికి ముందే శుభవార్త చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్లు సోమవారం రాజేంద్ర నగర్ లోని కో ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో పాల ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించే క్రమంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు, పాడి రైతులతో నిర్వహించిన అవగాహన సదస్సు లో పాల్గొన్న మంత్రి ప్రకటించారు. గేదె పాలు 46.69 రూపాయల నుండి 49.40 రూపాయలకు, ఆవుపాల ధరను 33.75 నుండి 38.75 రూపాయల కు పెంచుతున్నట్లు వివరించారు. అదేవిధంగా సొసైటీ (BMCU) నిర్వహణకు ప్రస్తుతం ఉన్న లీటర్ కు రూపాయి 25 పైసల నుండి 2 రూపాయలు (వర్షాకాలంలో) ఒక రూపాయి 50 పైసల నుండి 2.25 రూపాయలు (వేసవికాలంలో) పెంచుతున్నట్లు తెలిపారు. పెంచుతున్న ధరలతో ప్రతినెల 1.42 కోట్ల రూపాయల ఆర్దికభారం డెయిరీ పై పడుతుందని, అయినా పాడి రైతుల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి పెంచిన ధరలు వర్తిస్తాయని చెప్పారు. ఈ సదస్సులో పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, విజయ డెయిరీ ఇంచార్జి MD ఆధార్ సిన్హా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి, పలు జిల్లాలకు చెందిన పాడి రైతులు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మంది పాడి రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. అటువంటి పాడిరంగం అభివృద్దికి, పాడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. పాడి రైతులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో విజయ డెయిరీ కి పాలుపోసే రైతులలో SC, ST లకు 75 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీ పై పాడి గేదెలను అందించడం, డెయిరీ కి పోసే పాలకు లీటర్ కు 4 రూపాయల నగదు ప్రోత్సాహకం చెల్లించడం, సబ్సిడీ పై దాణా, గడ్డి విత్తనాలను అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఉచితంగా మందులు, వ్యాక్సిన్ లను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. 1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా జీవాల వద్దకే మొబైల్ వెటర్నరీ క్లినిక్ వెళ్ళి వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాడిరంగం ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నష్టాలలో ఉన్న విజయ డెయిరీ 800 కోట్ల రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. పాడి రంగం మరింత అభివృద్ధి చెందాలి, పాడి రైతులు ఆర్దికాభివృద్ధి సాధించాలనేది ప్రభుత్వం ఆలోచన అన్నారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు, మేలుజాతి పాడి పశువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం పశుసంవర్ధక, డెయిరీ, TSLDA, వెటర్నరీ యూనివర్సిటీ అధికారుల సమన్వయంతో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) సహకారంతో ఇంటిగ్రేటెడ్ డెయిరీ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టినట్లు వివరించారు. అంతేకాకుండా గ్రామాలలో కృత్రిమ గర్భదారణ శిభిరాలను నిర్వహించడంతో పాటు పాడి గేదెల ఆరోగ్య రక్షణ, పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా రైతులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అనేక విధాలుగా చేయూతను అందిస్తున్న విజయ డెయిరీకి పాలు పోయడం ద్వారా డెయిరీ మరింత అభివృద్ధి సాధించేందుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. విజయ సంస్థ లాభాలు పొందితే దాని ఫలితాలు పాడి రైతులకే అందించబడతాయని వివరించారు. ప్రైవేట్ డెయిరీ ల ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రభుత్వం కల్పిస్తున్న అనేక రకాల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబందు పథకం క్రింద అనేకమంది పాడి గేదెలను కొనుగోలు చేశారని, వారు కూడా విజయ డెయిరీకి పాలు పోసే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. పాడి రైతులు పశుసంవర్ధక శాఖ అధికారుల సూచనలు, సలహాలను పాటించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పశువుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న పలువురు రైతులు పలు సూచనలు, అభిప్రాయాలను వ్యక్త పరిచారు. పెండింగ్ లో ఉన్న పాడిరంగం మరింత అభివృద్దికి, పలు సమస్యల పరిష్కారం కోసం పాడి రైతులతో రాష్ట్ర, జిల్లా స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమై ప్రభుత్వ పరంగా చేపట్టవలసిన చర్యలు, పాడి రైతులు అనుసరించవలసిన విధానాలపై చర్చించడం ద్వారా పెనుమార్పులు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని సమావేశం అభిప్రాయ పడింది.


SAKSHITHA NEWS