దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్స్‌-2024 ఈవెంట్‌

Spread the love

దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్స్‌-2024 ఈవెంట్‌ను దిల్లీలోని భారత మండపం వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి మూడు వేల మందికి పైగా ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, 40 వేల మంది వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు.

ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. టెక్స్‌టైల్స్‌ రంగం భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కీలకంగా మారనుందన్నారు. 
‘‘దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటికి భారత్‌ అభివృద్ధిలో టెక్స్‌టైల్స్‌ రంగం కీలకపాత్ర పోషించనుంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. 2014 భారత్‌ టెక్స్‌టైల్స్‌ మార్కెట్‌ విలువ రూ.7 లక్షల కోట్ల కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం అది రూ. 12 లక్షల కోట్లకు చేరుకుంది. మరి కొన్నేళ్లలో దేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’గా మార్చాలని కేంద్రం సంకల్పించింది’’ అని మోదీ పేర్కొన్నారు. 

వికసిత్‌ భారత్‌కు పేదలు, రైతులు, యువత, మహిళలు ముఖ్య స్తంభాలని అన్నారు. వీరితో భారత్‌ టెక్స్‌టైల్స్‌ రంగం ముడిపడి ఉందన్నారు. అందువల్ల ఈ కార్యక్రమం మనందరికీ ఎంతో ముఖ్యమైందని మోదీ పేర్కొన్నారు. తాను ఎలాంటి సమాజాన్ని చూడాలనుకుంటున్నారో ప్రధాని ఈసందర్భంగా వెల్లడించారు.

ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉన్న సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమని తెలిపారు. ఇది ప్రజల శ్రేయస్సుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. అందుకు పదేళ్లుగా పోరాడుతున్నానని.. రానున్న ఐదేళ్లల్లో ఈ జోక్యాన్ని పూర్తిగా తగ్గిస్తానని మోదీ హామీ ఇచ్చారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page