SAKSHITHA NEWS

భర్త తప్పేమీ లేనప్పటికీ భార్య మాటిమాటికీ పుట్టింటికి వెళ్లిపోతున్నట్లయితే అతడిని మానసికంగా హింసించినట్లేనని, దాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం, ఆరాధన భావన ఉంటే వారి వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందని జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

సంయమనం కోల్పోయిన దంపతుల మధ్య ఎడబాటు పెరుగుతూపోతే వారు ఎన్నటికీ కలవలేనంతగా పరిస్థితి మారిపోతుందని చెప్పింది. భార్య హింస, క్రూరత్వ చర్యల కారణంగా విడివిడిగా ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 19 ఏళ్ల వైవాహిక జీవితంలో దాదాపు ఏడు సార్లు భార్య తనను వీడి వెళ్లిపోయిందని ఆమె భర్త కోర్టుకు వెల్లడించారు. అలా వెళ్లిన ప్రతిసారీ పది నెలల పాటు పుట్టింటిలో ఉందన్నారు. కుటుంబ న్యాయస్థానం ఈ జంటకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించగా భర్త హైకోర్టును ఆశ్రయించారు.

భార్యను పిశాచి, దెయ్యం అని పిలిస్తే క్రూరత్వం కాదు

భార్యను దెయ్యం, భూతం, పిశాచి అని భర్త పిలవడం క్రూరత్వం కింద రాదని పట్నా హైకోర్టు స్పష్టం చేసింది. తన నుంచి విడాకులు తీసుకున్న మహిళ ఫిర్యాదుపై కిందికోర్టు వెలువరించిన ఓ తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె మాజీ భర్త, మామ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సమయంలో పట్నా హైకోర్టు ఈమేరకు వ్యాఖ్యానించింది. దంపతులు విడిపోయినప్పుడు పరస్పరం దుర్భాషలాడుకోవటం మామూలేనని న్యాయమూర్తి జస్టిస్‌ బిబేక్‌ చౌధరి వ్యాఖ్యానించారు. ఈ మేరకు దిగువ కోర్టులు వెలువరించిన తీర్పును కొట్టేశారు.


SAKSHITHA NEWS