SAKSHITHA NEWS

ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరండి: సుప్రీంకోర్టు

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ సంచలన రిపోర్టు..

బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం

కోల్ కత్తా :
కోల్‌కతా డాక్టర్ హత్యా చారం కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రిపోర్టులో సీబీఐ కీలక విషయాలను పొందుపర్చింది. సీబీఐ నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

రేప్, మర్డర్ కేసును కప్పి పుచ్చే ప్రయత్నం చేశారని సీబీఐ తన రిపోర్టులో పొందుపర్చింది. తల్లిదండ్రులను తప్పుదారి పట్టించారని.. శవదహనం చేసిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఇక సంఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు సూచించింది. వైద్యులు పనిచేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందని ప్రశ్నించింది.

వైద్యం కోసం వస్తున్న పేద లను విస్మరించలేం. మీ ఆందోళన కారణంగా పేదలు నష్టపోకూడదు. మీరు వెంటనే విధుల్లో చేరండి.

మీరు విధుల్లో చేరిన తర్వాత మీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో కుండా చూస్తాం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది.


SAKSHITHA NEWS