SAKSHITHA NEWS

ఏపీలో విత్తనాల కొరత లేదా..? ఏపీ ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్నలు

అమరావతి: విత్తనాల కోసం రైతులు తిప్పలు పడుతున్నారని, క్యూలైన్లు కడుతుంటే ప్రభుత్వానికి కనిపించట్లేదా అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు.

విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేకుండా ఉందని విమర్శించారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా..? అని నిలదీశారు.

కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్విట్టర్(X) వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

‘‘పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా..?
సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా పరిస్థితి చూసే మాట్లాడుతున్నారా.. ?
రాత్రంతా క్యూలైన్లో రైతులను నిలబెట్టడమా మీ ఎన్డీఏ ప్రభుత్వ కట్టుబడి ఇదేనా.. ?

సంక్షోభం నుంచి సంక్షేమం అంటే కుండపోత వర్షంలో మహిళలను ఇబ్బందులు పాలు చేయడమే కాబోలు! రైతుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేక కుటుంబాన్ని గుంజుతున్నారు.
YCP ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టకనే కదా.. మీకు పట్టం కట్టింది. మాజీ సీఎం జగన్ నిండా ముంచారు అనే కదా 11 సీట్లకు పరిమితం చేసింది. మోసం చేశారు అనే కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు.

రైతులను వ్యతిరేకించే బీజేపీతో మీరు కూటమి కట్టి, పక్షపాతిగా ఉంటామని హామీలు ఇచ్చి, గద్దెనెక్కి, ఇప్పుడు వాళ్లను వర్షంలో నిలబెట్టారు.

ఇది మీ సర్కారుకి న్యాయమా..?
నాట్లు వేసిన 130 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని జేజీఎల్:384 రకం విత్తనాలను కావాలని అడగటం రైతులు చేసిన పాపం అంటారా మంత్రిగారు ! రైతు అడిగింది ఇవ్వాలని హక్కుగా మేము ప్రశ్నిస్తే,రెచ్చ గొట్టినట్లు ఎలా అవుతుందో, వ్యవసాయ శాఖ మంత్రిగారు సమాధానం చెప్పాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS