SAKSHITHA NEWS

షెకావత్‌ది నోరా?.. మోరీనా?: హరీష్రావు

హైదరాబాద్: కేంద్రమంత్రి షెకావత్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మంత్రి హరీష్రావు తప్పుబట్టారు. షెకావత్ వ్యాఖ్యలను హరీష్రావు తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో షెకావత్ కూడా కాళేశ్వరాన్ని మెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. మెచ్చుకున్న నోటితోనే.. పుచ్చిపోయిన మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. ఆయనది నోరా?.. మోరీనా? అని హరీష్రావు ప్రశ్నించారు. కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని, అవి కట్టేందుకు కేంద్రమే అప్పులు ఇచ్చిందని గుర్తుచేశారు. షేకావత్ దివాళాకోరు మాటలు ఖండిస్తున్నామని ప్రకటించారు. కాళేశ్వరానికి కితాబు ఇచ్చిన వారే మతలబు ఉందంటున్నారని విమర్శించారు. ‘‘గతంలో మీరు కాళేశ్వరంపై మాట్లాడిన మాటలు గుర్తుచేసుకోండి. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీ తెలంగాణను ప్రశంసించిన వీడియోలు ఉన్నాయి. సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ కూడా కాళేశ్వరంను ప్రశంసించారు’’ అని హరీష్రావు గుర్తుచేశారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇప్పుడు పంప్‌ హౌస్‌లు మునిగిపోయాయి. వాటి పునర్నిర్మాణం, మరమ్మతుల పేరుతో మళ్లీ వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది’’ అని షెకావత్‌ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడంలేదని, తెలంగాణకు మోదీయే ప్రధాన శత్రువని పంద్రాగస్టు వేడుకల ప్రసంగంలో సీఎం కేసీఆర్‌ ఆరోపించిన విషయాన్నిషెకావత్ మీడియా దృష్టికి తెచ్చారు..


SAKSHITHA NEWS