SAKSHITHA NEWS

విడదల రజినిపై విచారణకు ఆదేశం .

అమరావతి: మాజీ మంత్రి విడదల రజనీ తమను బెదిరించి, భయపెట్టి రూ. కోట్లు వసూలు చేశారంటూ హోంమంత్రి అనితకు ఫిర్యాదు అందింది. పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారి తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హోంమంత్రికి అందజేశారు. ఆ ఫిర్యాదులో తమ ప్రాణాలకు హానీ ఉందని, రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

ఫిర్యాదు దారు చలపతిరావు మరో ముగ్గురు భాగస్వాములతో కలిసి 2010 నుంచి ఎడ్లపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వ్యాపార సంస్థను నడుపుతున్నారు. 2020 సెప్టెంబర్ 9న అప్పటి ఎమ్మెల్యే విడదల రజనీ పిఏ దొడ్డా రామకృష్ణ క్రషర్ వద్దకు వచ్చి ఎమ్మెల్యే కలవమని చెప్పారు. దీంతో వారు రజనీని ఆమె కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కలవలేదని అంటూనే.. వ్యాపారం చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాలని ఆమె చెప్పారు. తన పిఏను కలిసి అతను చెప్పిన విధంగా చేయాలని చెప్పి పంపేశారు. దీంతో వారు పీఏను కలిసారు. ఆయన రూ. 5 కోట్లు చెల్లించమని చెప్పారు. అంత చెల్లించలేమని చెప్పిన క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించారు. వ్యాపారం ఎలా చేస్తారో.. మీ అంతు చూస్తామంటూ హెచ్చరించారు.


SAKSHITHA NEWS