SAKSHITHA NEWS

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచండి

కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు

పగడ్బంధీగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు: నారా చంద్రబాబు నాయుడు

రవాణా శాఖ, ఆర్టీసీ పై సీఎం చంద్రబాబు సమీక్ష. పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులు.

ఈ సందర్బంగా నిర్వహణ సంబంధిత అంశాలు,రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి పై సమీక్షా చేశారు

అమరావతి : రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డీజిల్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్ లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీలో కూడా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలులో కేంద్రం ఇస్తున్న సబ్సీడీలను వినియోగించుకుని 1253 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే ఛార్జింగ్ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని అధికారులకు సూచించారు. బస్సులు అద్దెకు తీసుకునే విధానం వల్ల లాభనష్టాలు, సొంతంగా బస్సులు కొనుగోలు చేయడం వల్ల కలిగే ఉపయోగాలపై పూర్తిస్థాయి నివేదికతో రావాలని సీఎం సూచించారు.

గత ప్రభుత్వం కొత్తగా బస్సుల కొనుగోలు చేయలేదని, 15 లక్షల కి.మీ కంటే ఎక్కువ తిరిగిన బస్సులు కూడా ప్రస్తుతం సర్వీసులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే బస్సులకు బ్రేక్ డౌన్ సమస్యలు త‌లెత్తి, ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ….గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు బ‌స్సు సర్వీసులు తగ్గించిందని, తిరిగి సర్వీసుల సంఖ్యను పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. క్ర‌మంగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సుల వైపు ఆర్టీసీ వెళ్లాలని సూచించారు. ఆర్టీసీ కార్గో ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని సూచించారు.

ఆన్ లైన్ విధానాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన 1489 డీజిల్ బస్సులను కూడా సమకూర్చుకోవాలని సీఎం అన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది తప్ప, ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ప్రమాదాల నివారణకు ఎస్పీ, కలెక్టర్, రోడ్ సేఫ్టీ అధికారులు సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్స్‌ గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను తొలగించాలని ఆదేశించారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ను ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నారు. వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డు అందించాలన్నారు.

ఉచిత బస్సు పథకంపై సమీక్ష

♦️ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధికారులతో సీఎం చర్చించారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఢిల్లీ, కర్నాటక, పంజాబ్, తమిళనాడుతో పాటు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలన్నారు. ఈ మేరకు అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. రెండు రోజులు ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా, మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలా విధానాలు రూపొందించాలన్నారు.

WhatsApp Image 2024 08 22 at 11.11.23

SAKSHITHA NEWS