ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.

Spread the love

ఆగని రైల్వే ప్రమాదాలు – ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.

రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి.

బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత, శానిటేషన్, పార్కింగ్ దోపిడీ తదితర సమస్యలను పరిష్కరించండి.

కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలి. భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలి. పూర్తి కాలం రైల్వే మంత్రిని నియమించండి.

రైలు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో స్వతంత్ర విచారణ జరిపించాలి.

జూన్ నెలలో అత్యంత ఘోరమైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 288 మంది మరణించి 1100 మందికి పైగా గాయపడిన ఘటన మరువక ముందే దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు దుర్ఘటనలను ఉద్యోగుల, ఆఫీసర్ల,పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి తాజాగా వ్రాసిన లేఖలో పేర్కొంటూ భద్రతా లోపాలను ఎత్తి చూపారు.

కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ), దాని అనుబంధ గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వే ప్రమోటీ ఆఫీసర్స్ ఫెడరేషన్ (ఐ.ఆర్.పి.ఓ.ఎఫ్) తదితరులు పలుమార్లు వివిధ అంశాలపై సమర్పించిన వినతి పత్రాలను, కాగ్ నివేదికలను జత చేశారు. రైల్వే భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐ.ఆర్.ఎమ్.ఎస్) పేరిట ఇటీవల ప్రవేశపెట్టిన స్కీం పట్ల పునరాలోచన చేయాలని కోరారు.

హౌరా- విశాఖపట్నం – విజయవాడ – చెన్నై మార్గంలో 2011-12లో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ ‘కవచ్’ నెలకొల్పక పోవడం, సిగ్నలింగ్ టెలీ కమ్యూనికేషన్ కింద కేటాయించిన బడ్జెట్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉన్న రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ తదితరములకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయక పోవడం, రైల్వే లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమన్నారు.

రైల్వేలలో కనీస అవసరాలకు ప్రాధాన్యత నివ్వకుండా, సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ ఆదాయాన్ని గడిస్తున్న రైల్వే శాఖలో 3.11 లక్షల గ్రూప్ సి పోస్టులు, 3,018 గెజిటెడ్ క్యాడర్ సాంక్షన్ అయిన పోస్టులు ఖాళీగా వున్నా భర్తీకి నోచుకోకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో చాలా మంది మహిళా లోకో పైలట్లు, ఇతర సిబ్బంది రోజుకు 12 గంటలకు మించి సెలవు లేదా విశ్రాంతి లేకుండా నిద్రలేమి, బిజీ షెడ్యూల్స్ తో పని చేస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వ వాదనలు దాని స్వంత ఆడిటర్‌ అయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గతేడాది నివేదికలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. రైలు భద్రతపై కాగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదని పేర్కొన్నది. 2017-2021 మధ్య జరిగిన రైల్వే ప్రమాదాలపై కాగ్‌ విశ్లేషణ ప్రకారం.. ఈ కాలంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పినవి 1392 ప్రమాదాలు (69 శాతం). అంటే పట్టాలు తప్పి ఢీ కొనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రమాదాలకు కారణం ‘మానవ తప్పిదం’ అని నిందించటం ఏండ్లుగా ఒక సాధారణ ధోరణిగా మారిందనీ, అయితే కాగ్‌ నివేదిక ప్రభుత్వ వాదనలు తప్పని నిరూపిస్తున్నదని తెలిపారు.

ట్రాక్ ల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యమని కాగ్ 2022 సెప్టెంబర్ నివేదికలో అక్షింతలు వేసినా, రైలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా, లోపాలు ప్రస్తావించినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

2017-18లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌కే) రైల్వే భద్రతా నిధి గురించి కాగ్‌ ఉటంకించింది. 1127 పట్టాలు తప్పగా 289 (26 శాతం) మాత్రమే పునరుద్ధరణ పనులకు నోచుకున్నాయని వివరించింది. ఆర్‌ఆర్‌ఎస్‌కే నుంచి ప్రాధాన్యత-1 పనులపై మొత్తం వ్యయం 2017-18లో 81.55 శాతం నుంచి 2019-20లో 73.76 శాతానికి తగ్గుదల ధోరణిని చూపించిందని పేర్కొన్నది. ట్రాక్‌ పునరుద్ధరణ పనులకు 2018-19లో నిధుల కేటాయింపు రూ.9607.65 కోట్ల నుంచి 2019-20లో రూ.7417 కోట్లకు తగ్గింది అని కాగ్‌ వివరించింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019-20లో మొత్తం వ్యయంలో ట్రాక్‌ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావటం గమనార్హం. భద్రతకు సంబంధించిన పనులకు ఆర్థిక సాయం అందించటానికి ప్రత్యేక నిధిని సృష్టించే ఏకైక ఉద్దేశ్యం విజయం సాధించ లేకపోయిందని కాగ్‌ పేర్కొన్నది. పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాక్‌ నిర్వహణ అని వివరించింది. భారత రైల్వే లక్షలాది ఖాళీలతో, నామ మాత్రపు అవుట్‌సోర్సింగ్‌తో కార్యకలాపాలను నిర్వహించిందని కాగ్‌ వెల్లడించింది.

ట్రాక్ ల సమర్థవంతమైన నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థ, రోలింగ్ స్టాక్ మొదలైన వాటితో పాటు తగిన సంఖ్యలో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించడం మరియు అన్నింటికంటే ముఖ్యంగా రైల్వే ఆపరేషన్ యొక్క వివిధ విధుల మధ్య సమర్థవంతమైన సమన్వయంపై ఆధారపడి ఉంటాయి. వీటన్నింటినీ నిర్లక్ష్యం చేయబడ్డాయని తెలిపారు. 2017 లో సమర్పించిన భద్రతపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులను, 2015 లో రైల్వే మంత్రిత్వ శాఖ ‘శ్వేతపత్రం’ను అమలు చేయలేదు. పాత ట్రాక్ ను యుధ్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంటుందని, కానీ ఆర్థిక వనరులు లేమి సాకుతో చేయకపోవడంతో బ్యాక్ లాగ్ పెరుగుతూనే ఉన్నదని, అదే సాకుతో పాతబడి పోయిన సిగ్నల్ గేర్ ను కూడా మార్చటం లేదని అన్నారు.

రైల్వేలు ప్రజల ఆస్తియని,మన ప్రజల సొమ్ముతో భారత కార్మికుల కష్టాలతో భారతీయ రైల్వేలు నిర్మించబడ్డాయని పేర్కొన్నారు. రైళ్ళు, రోడ్లు సామాన్య ప్రజలకు సరసమైన రవాణాను అందించడానికి ఉద్దేశించబడినవని, ఇవి ఏ ప్రభుత్వమైనా తన పౌరులకు సరసమైన ధరలకు భద్రతతో అందించాల్సిన సేవలని గుర్తు చేశారు. ప్రైవేటు కార్పొరేట్లకు లాభాలను ఆర్జించే మార్గాన్ని సృష్టించేందుకు భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించవద్దని కోరారు.

2017-21 మధ్య కాలంలో 2వేలకు పైగా దుర్ఘటనలు జరిగాయి. వీటి వల్ల జరిగిన ప్రమాదాలు 217 ఉన్నాయి. వీటిల్లో ప్రాణ నష్టం, గాయపడడం, రైల్వే ఆస్తులకు నష్టం వంటివి సంభవించాయి. బృహత్తరమైన రైల్వే వ్యవస్థలో అంతా సవ్యంగా సాగడం లేదు. రైళ్ళు ప్రయాణించే ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను నియంత్రించే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థలో పొరపాటు కారణంగా బాలాసోర్
ప్రమాదం జరిగి ఉండవచ్చని రైల్వేబోర్డు, రైల్వే మంత్రి ఇప్పటికే సూచనప్రాయంగా పేర్కొన్నారు. 2017-21 మధ్య కాలంలో రైల్వేస్‌లో రైళ్ళు పట్టాలు తప్పిన ఘటనలపై కాగ్‌ ఇటీవల ఇచ్చిన నివేదిక వ్యవస్థలో ఉన్న కొన్ని ప్రమాదకరమైన లోపాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. రైల్వే ట్రాక్‌ల్లో నిర్మాణపరమైన లోపాలను, అలాగే పాయింట్లు, లైన్లు, కర్వ్‌లు వంటి అంశాలను తనిఖీ చేసి అంచనా వేసే ట్రాక్‌ రికార్డింగ్‌ కార్ల సోదాలు 30-100శాతం తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. పట్టాలు తప్పిన 1129 ఘటనల్లో 422 ఘటనలు ఇంజనీరింగ్‌ సమస్యలు (ట్రాక్‌ల నిర్వహణ సరిగా లేక పోవడం (171 కేసులు), ట్రాక్‌ ప్రామాణికాలు పాటించకపోవడం (156 కేసులు) వల్లే జరిగాయని పేర్కొంది. బోగీల చక్రాల్లో లోపాల వల్ల జరిగిన ప్రమాదాలు 182 ఉండగా, పాయింట్లు సరిగా నిర్దేశించక పోవడం, ఇతర పొరపాట్ల కారణంగా 275 ప్రమాదాలు జరిగాయని నివేదిక పేర్కొంది.

జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డుల ప్రకారం గడిచిన పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల్లో 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 70 శాతం మంది 2017- 21 మధ్య కాలంలో మరణించారని పేర్కొన్నారు.

ప్రారంభించిన రైలునే అట్టహాసంగా మళ్ళీ ప్రారంభించే బదులు సామాన్యులు ప్రయాణించే రైళ్ల బాగోగులు పట్టించుకోవాలని, కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణే అన్నింటికీ పరిష్కారం అనే మానసిక స్థితి నుండి బయటపడి వాస్తవాలను ఆలోచించి ప్రజల భద్రతకు ఏం చేయాలో తెలుసుకుని ఇప్పటికైనా పూనుకోవాలని, దుఃఖితులకు ఓదార్పునివ్వాలని కోరారు. ప్రతి వందేభారత్ కోసం రైల్వే రూ. 115 కోట్లు పైగా వెచ్చిస్తున్నదని, 2026 తర్వాత ప్రారంభమయ్యే బుల్లెట్ ట్రైన్ వంటి అసాధారణ రేట్లుండే రైళ్ళతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగేదేముంటుందని ప్రశ్నించారు.

తమ వైఫల్యం, అసమర్థతలను, చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని, ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే మంత్రిత్వ శాఖకు ఇది అలవాటేనని ఆయన పేర్కొన్నారు. ఐటీ సెల్‌ లోని పెయిడ్‌ ఆర్టిస్టులు దానికి అన్ని రకాల అబద్ధాలూ గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేసరికి ప్రజలు దాన్ని మర్చిపోతారని ఆయన పేర్కొన్నారు.

2023 మార్చిలో రైల్వే భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ సమర్పించిన నివేదికలో రైల్వే మంత్రిత్వ శాఖ అలసత్వాన్ని ఎత్తి చూపిందని, రైల్వే భద్రతకు సంబంధించిన నివేదికలు విస్మరించబడుతున్నాయని వివరించిందని తెలిపారు. కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) చేసిన సిఫారసులు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అత్యంత ప్రాముఖ్యతను పొందవల్సి ఉన్నప్పటికీ అది వాస్తవానికి భిన్నంగా ఉన్నదనీ, తక్కువ శ్రద్ధను కలిగి ఉన్నదని పేర్కొన్నది. రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని ప్యానెల్‌ ఆ నివేదికలో సిఫారసు చేసిందని గుర్తు చేశారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలని,కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలని వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు

వి. కృష్ణ మోహన్
నేషనల్ వైస్ చైర్మన్,
కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ) 9440668281
కార్యదర్శి, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ [email protected]

Related Posts

You cannot copy content of this page