SAKSHITHA NEWS

బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం నీచమైన వ్యాఖ్యలు.. రేవంత్‌ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌

BRS Party | బీఆర్‌ఎస్‌ సీనియర్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనానికి బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది.

తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావని.. ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ.. జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తనస్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు కోరారు.

సుదీర్ఘకాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళ సభ్యులపై, అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరి మనసులను నొప్పించాయని.. జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకు, ఆడబిడ్డకు ఈ వ్యాఖ్యలు అవమానకరమని కేటీఆర్‌ అన్నారు. అధికారం, అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదన్న కేటీఆర్‌.. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయాలని కేటీఆర్‌ కోరారు..


SAKSHITHA NEWS