SAKSHITHA NEWS

చంద్రగిరి ఎమ్మెల్యేచే 1.24 లక్షల మట్టి విగ్రహాలు

  • ప్రతి ఇంటికి ఉచిత పంపిణీకి సన్నద్ధం సాక్షిత, తిరుపతి బ్యూరో:
    పర్యావరణ హితమే లక్ష్యంగా.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1 లక్ష 24 వేల బంక మట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టారు. దేశంలో, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో పంపిణీ చేయలేని విధంగా చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతి ఏటా చర్యలు ముమ్మరం చేశారు. గడిచిన పది సంవత్సరాలుగా చెవిరెడ్డి ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గురువారం తిరుచానూరు మార్కెట్ యార్డ్ లో 1లక్ష 24 వేల బంక మట్టి విగ్రహాల తయారీని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం విగ్రహాల తయారీకి అవసరమైన బంకమట్టి మిశ్రమాన్ని కలపడంలో కుమ్మరి కార్మికులతో కలిసి పాలుపంచుకున్నారు.
    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడారు.. కాలక్రమేణ పాత సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల సూచనల మేరకు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి ఏటా, ప్రతి ఇంటికి బంక మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను పంపిణీతో పాటు పూజించేలా ప్రోత్సహించటం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది మరింత పెద్ద ఎత్తున ఒక లక్ష 24 వేల మట్టి విగ్రహాలు తయారీకి శ్రీకారం చుట్టామన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 25 ప్రదేశాలలో 7 వేల మంది కుమ్మరి కార్మికులు గడిచిన 25 రోజులుగా బంకమట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. ఈ బొమ్మల తయారీకి సుమారు 2,500 టన్నుల బంకమట్టి 90 ట్రిప్పర్లతో తెప్పించామన్నారు. అంతే కాకుండా ప్రజలకు గణనాథుని పూజించే విధానం బుక్లెట్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు. మట్టి వినాయక విగ్రహాలతో పాటు పూజా విధాన బుక్లెట్ ను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ మట్టి వినాయక విగ్రహాలను ఇంటింటికి పంపిణీ చేయడంలో 2 వేల మంది వాలంటీర్లు భాగస్వామ్యులు కానున్నట్లు వివరించారు. ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు మట్టి విగ్రహాలు దోహదం చేస్తాయన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెరిగిపోయి కాలుష్యం పెరిగిపోతుందన్నారు. కాలుష్య నియంత్రణ కు శాసన సభ్యుడిగా నా వంతు బాధ్యతను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

SAKSHITHA NEWS