సామూహిక వరలక్ష్మీ వ్రతంతో ధర్మ పరిరక్షణకు పిలుపు….
హిందూ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి…..
— విహెచ్పీ….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని// స్థానిక శ్రీ కోదండ రామాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతంలో గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా విహెచ్పీ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడుతూ హిందూ సమాజం తమ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి, వాటిని భావితరాలకు అందించాలని అన్నారు. యువతకు హిందూ ధర్మం, పూజా విధానాలు, ఆచార సంప్రదాయాల ప్రాధాన్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళలు, బాలికల భద్రతపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని, యువతను మోసపూరిత సంబంధాలు, మత మార్పిడి వంటి అంశాలపై అప్రమత్తం చేయాలని సూచించారు.
మహిళల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంపొందించేందుకు విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి, దుర్గావాహిని విభాగాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
ధర్మరక్షణతో పాటు దేశరక్షణను ప్రతి కుటుంబం బాధ్యతగా భావించాలని, నేటి యువతలోనే దేశ భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కటాక్షంతో హిందూ సమాజం సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో విహెచ్పీ నగర కార్యదర్శి మునిగాల సంపత్, కోశాధికారి నేరేడుకొమ్మ వెంకటస్వామి, ఉపాధ్యక్షురాలు మమత, అడిగొప్పుల రాజు, మేడగోని రవీందర్, కొండపర్తి లింగన్న, శ్రీనివాస్, జలంధర్, రాయమల్లు, మాతృశక్తి, దుర్గావాహిని బాధ్యులు మమత కోటతిరుమల, లలితమ్మ, భవాని, శ్రీజ, వీణ, ఇందిర, స్వాతి, మహిళా కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
పూజలో పాల్గొన్న మహిళలకు విహెచ్పీ మాతృశక్తి, దుర్గావాహిని విభాగం సభ్యులు సేవలు అందించారు. రానున్న రోజుల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని మరింత వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
