SAKSHITHA NEWS

ఏపీ ‘పది’ పరీక్షల్లో మార్పులు.. ఇకపై ఏడు పేపర్లు

భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్

విడిగా జీవశాస్త్రం పేపర్

రెండింటిలోనూ కలిపి 35 మార్కులు సాధిస్తేనే పాస్

కాంపోజిట్ విధానం రద్దు

ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న తొలగింపు

ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత విద్యా సంవత్సరంలో ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించగా, ఈ విద్యా సంవత్సరంలో ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు.

భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు ఒక ప్రశ్నపత్రం, మరో 50 మార్కులకు జీవశాస్త్రం ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. రెండింటిలోనూ కలిపి 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం కేటాయిస్తారు.

మిగతా అయిదు సబ్జెక్టులకు మాత్రం ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. అలాగే, ప్రస్తుతం ఉన్న కాంపోజిట్ విధానాన్ని రద్దు చేశారు.

70/30 మార్కుల విధానంలో తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్/, ఉర్దూ/పార్టీ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇక నుంచి ఫస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది.

ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న తొలగించి దాని స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో దానికి రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.

రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా, ఇప్పుడు గద్యాన్ని చదివి నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.

ఒక్కో  ప్రశ్నకు 8 మార్కులు ఉంటాయి. విజయవాడలో నిన్న ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను వెల్లడించారు….


SAKSHITHA NEWS