SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా నియంత్రించేందుకు జిల్లా స్ధాయి నార్కోటిక్స్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల సరఫరా మూలాలకు సంబంధించిన అన్ని అనుసంధానాలను గుర్తించి కట్టడి చేయడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలవుతుందని అన్నారు. ఇందుకు అధికారుల సమిష్టి కృషి, స్థానిక ప్రజల మధ్య సమన్వయం ఉండాలని ఆయన అన్నారు. జిల్లా స్థాయిలో సమాచార వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా మాదక ద్రవ్యాల రవాణాపై స్పష్టమైన సమాచారం అందుతుందన్నారు. దీని ఆధారంగా సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించడానికి వీలవుతుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం పెరిగితే ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతోందన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి విద్యాలయాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన అన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు అలవాటు పడిన వారిని రిహాబిలిటేషన్‌ సైకాలజిస్ట్‌, ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ ద్వారా మార్పు తీసుకొని రావాలన్నారు. సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్. వారియర్‌ మాట్లాడుతూ, సరదా కోసం సిగరెట్‌తో మొదలవుతున్న యువత వ్యసనాలు, మద్యం, ఆ తరువాత మాదక ద్రవ్యాల వరకు వెళ్తుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయకుంటే భవిష్యత్తులో సమాజంపై తీవ్ర దుష్ప్రబావం చూపుతుందని అన్నారు. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్‌ చేసుకున్న గంజాయి మాఫియా, చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి వ్యాపారాన్ని చాపకింద నీరులా విస్తరింపజేయ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై వారు సామాజిక సంబంధాలను సైతం కోల్పోతున్నారని, తరచూ ఉద్రేకానికి లోనవుతూ, నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు కలెక్టర్‌ డి. మధుసూదన్‌ నాయక్‌, అదనపు డిసిపి ఏ.ఎస్.సి. బోస్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నాగేందర్‌ రెడ్డి, ఏ.సి.పిలు ప్రసన్నకుమార్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS