చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం

Spread the love

✍️ప్రముఖ ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థ ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం.. ‘నాణ్యమైన విద్య అన్నది హక్కు’ ఇది కొత్త నినాదమని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని సీఎం జగనన్న అన్నారు. ప్రముఖ ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థ ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగనన్న సమక్షంలో విద్యాశాఖ, ఎడెక్స్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

✍️ఈ సందర్భంగా సీఎం జగనన్న మాట్లాడుతూ..
‘‘ఏపీలో చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రైటు టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం. నాణ్యమైన విద్య అన్నది హక్కు ఇది కొత్త నినాదం. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం. మన విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి. నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యం. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి. అప్పుడే మన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు వస్తాయి.

ఉన్నత విద్యలో మనం వేస్తున్న అడుగులు ఫలాలు ఇవ్వాలంటే బహుశా నాలుగైదేళ్లు పట్టొచ్చు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమూల మార్పులు తెచ్చాం. మానవ వనరులపై పెట్టుబడి అనేది ప్రధాన అంశంగా భావిస్తున్నాం. ప్రతి అడుగులోనూ చిత్తశుద్ధి, అంకిత భావం చూపిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టాం. గ్లోబల్‌ సిటిజన్‌ కావాలంటే మన భాషలో మార్పులు రావాలి. ప్రపంచస్థాయిలోనే పోటీపడాలి.. లేకుంటే మన భవిష్యత్‌ మారదు.

నాడు–నేడు, అమ్మ ఒడి, గోరుముద్దతో మన ప్రయాణం ప్రారంభమైంది. టెన్త్‌ విద్యార్థులకు ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు. ఐబీ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరం టీచర్లకు సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టిపెట్టాం. ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌ను డిజిటలైజేషన్‌ చేస్తున్నాం. పిల్లలకు చదువులు సులభతరంగా అర్థమయ్యేలా ట్యాబ్‌లు ఇస్తున్నాం. బైజూస్‌ కంటెంట్‌తో అనుసంధానం చేశాం. ఈ ప్రయాణం… ఇక్కడితో ఆగిపోకూడదు’’ అని సీఎం జగనన్న అన్నారు.

✍️అత్యున్నత విద్యలో…
అత్యున్నత విద్యలో కూడా ఇలాంటి అడుగులు వేయాల్సిన అవసరాన్ని భావించి దానిపై కూడా దృష్టిపెట్టాం. ఈ ఐదేళ్లలో కూడా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌పై పెట్టిన ధ్యాస ఇక ముందు ఎవ్వరూకూడా పెట్టలేదు. పేదరికం పిల్లల చదువులకు అడ్డురాకూదు. దీనికోసం పూర్తి ఫీజు రియింబర్స్‌ మెంట్ ఇచ్చాం. ప్రతి ఏటా జూన్‌-జులై, అలాగే విద్యాసంవత్సరం చివర్లో కూడా వసతి దీవెన అందిస్తున్నాం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా పాఠ్యప్రణాళిక తీసుకు వచ్చాం. డిగ్రీలో కూడా బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ తీసుకు వచ్చాం. డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో కూడా బైలింగువల్ పాఠ్యపుస్తకాలు.. 400కు పైగా ద్విభాషా పాడ్ క్యాస్ట్‌లు.. తీసుకొచ్చాం. రాష్ట్రంలోని 18 యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న 3,295 పోస్టుల భర్తీచేయడానికి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే కోర్టు కేసులు అధిగమించి, నియామక ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. 2019 నాటికి 257 ఉన్నత విద్యాసంస్థలు మాత్రమే NAAC గుర్తింపు పొందగా, ఈరోజు రాష్ట్రంలోNAAC గుర్తింపు పొందిన విద్యా సంస్థలు 437 ఉన్నాయి.

✍️ఎడెక్స్‌తో ఈరోజు ఒప్పందం మరో అడుగు
దాదాపు 2వేలకు పైగా కోర్సులు మన పాఠ్యప్రణాళికలో వర్టికల్స్‌కింద మన పిల్లలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఐంఐటీ, ఎల్‌ఎస్‌ఈ, హార్వర్డ్‌ ఇంకా ప్రఖ్యాత కాలేజీల కోర్సులుకూడా దీనిద్వారా నేర్చుకోవచ్చు. క్రెడిట్స్‌ మన పాఠ్యప్రణాళికలో భాగం అవుతాయి. మన దగ్గర అందుబాటులో లేని కోర్సులు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అత్యుత్తమ యూనివర్శిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండడంవల్ల ఉద్యోగం సాధనమరింత సులభతరం అవుతుంది. మన పిల్లలకు ఇవ్వగలిగిన ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య వారికి అదించగలిగితే వాళ్లు పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. టాప్‌ -50 ర్యాంకింగ్స్‌లో ఉన్న 320 కాలేజీల్లో సీటు వస్తే.. రూ.1.2 కోట్ల వరకూ కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది’’ అని సీఎం జగనన్న అన్నారు

Related Posts

You cannot copy content of this page