భక్తిభావంతో శ్రీవారి పాదుకల ఊరేగింపు
** తనకు గుర్తుగా శ్రీవారు పంపుతాడని ఐతిహ్యం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సాయంత్రం గరుడసేవను పురస్కరించు కుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు భక్తిభావంతో జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణపాదుకలను మొదట తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది.
గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఊరేగింపు కార్యక్రమంలో టీటీడీ సివిఎస్వో కే.వి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఇతర ఉన్నతాధికారులు, అర్చకులు బాబుస్వామీ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
