SAKSHITHA NEWS

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : ఎంపీ నామ

ఖమ్మం పత్తి రైతుల సమస్య పరిష్కారానికి జీఎస్టీ చైర్మన్ హామీ

పార్లమెంటరీ కమిటీ సమావేశంలో నామ నాగేశ్వరరావు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఖమ్మం పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని రాష్ట్ర కస్టమ్స్ & సెంట్రల్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్ శివ నాగకుమారి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. పార్లమెంటరీ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టడీ టూర్ లో భాగంగా మంగళవారం హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో నామ నాగేశ్వర రావు పాల్గొని, ఖమ్మం పత్తి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను కస్టమ్స్, సెంట్రల్ టాక్స్ కమీషనర్ దృష్టి కి తీసుకొచ్చారు. జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి గత మార్చిలో కూడా ఎంపీ నామ , ఖమ్మం పత్తి వ్యాపారులుతో కలసి ఢిల్లీ వెళ్లి వారి సమస్యలను జీఎస్టీ చైర్మన్‌ వివేక్‌ జోహావీని ప్రత్యేకించి కలసి వివరించిన సంగతి తెలిసిందే.

ఆ సందర్భంగా ఖమ్మం పత్తి వ్యాపారుల సమస్యల గురించి చర్చించటం తో పాటు పాత విధానంలో జీఎస్టీ చెల్లించే అవకాశం కల్పించాలని, కేసులను ఎత్తివేసేలా చూడాలని నామ కోరగా జీఎస్టీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు . 2017 నుంచి 2019 వరకు ఆర్సీఎం పద్దతిలో జీఎస్టీ చెల్లించామని, కొత్త విధానంలో 2019 నుంచి ముడి పత్తి అమ్మకాలు, కొనుగోళ్లపై జీఎస్టీ చెల్లిస్తున్నట్టు వ్యాపారులు తెలిపారని, కానీ ఖమ్మంలోని జీఎస్టీ అధికారులు మొదటి నుంచి అమ్మకాలు, కొనుగోళ్లపై జీఎస్టీ లెక్క కట్టలేదని ఆరోపిస్తూ పాత బకాయిలు కూడా కట్టాలంటూ నోటీసులు ఇచ్చిన సంగతిని శివ నాగకుమారి దృష్టికి తీసికెళ్లారు. పాత విధానంలోనే పత్తి వ్యాపారులు జీఎస్టీ కట్టినా కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉప సంహరించుకోవాలని నామ కోరారు.

పత్తి వ్యాపారులు కొనుగోళ్లు ఆపితే రైతులు ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి వారిపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించాలని అభ్యర్థించారు. 2019 నుంచి ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తూ వ్యాపారులు జీఎస్టీ చెల్లిస్తున్నారని నామ వివరించారు. సానుకూలంగా స్పందించిన కస్టమ్స్ & సెంట్రల్ టాక్స్ చీఫ్ కమీషనర్ శివ నాగకుమారి ఖమ్మం పత్తి వ్యాపారుల సమస్యను ఢిల్లీకి రిఫర్ చేయడం తో పాటు సమస్యలను త్వరితగతిన పరిష్కారానికి హామీ ఇచ్చారు.


SAKSHITHA NEWS