అందుకే కడియం అప్రూవర్గా మారారు.. రాజయ్య సంచలన వ్యాఖ్యలు
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి సచ్చిన పాము అని.. అయినా తోక ఆడిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై ఉందని ఉద్ఘాటించారు.స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కడియం శ్రీహరి తానే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్లో తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడారు.
కడియం మాటలను సాక్ష్యంగా తీసుకుని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని సూచించారు. ప్రజల నుంచి వ్యతిరేకత తట్టుకోలేకనే.. కడియం అప్రూవర్గా మారారని సెటైర్లు గుప్పించారు. కడియంకు ఘన్పూర్ అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. కడియంకు తన అభివృద్ధి తప్పా.. ఘన్పూర్ అభివృద్ధితో పనిలేదని విమర్శించారు. ఘన్పూర్లో కడియం మార్క్ ఎక్కడా కనిపించదని ఆరోపించారు తాటికొండ రాజయ్య. కడియం తనకు తాను రాజకీయ సమాధి కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. బిడ్డను రాజకీయ వారసురాలని చేసుకోవటమే కడియం మార్క్ అని విమర్శించారు. కడియం శ్రీహరి అవినీతి తిమింగలమని.. బినామీల పేరుతో కోట్లు వెనకేసుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫిరాయింపుల బరిలో కడియం ముందు వరుసలో ఉన్నారని ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత స్పీకర్పై ఉందని.. లేకపోతే కోర్టు ధిక్కారణ కింద కోర్టుకు పోవాల్సి ఉంటుందని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
