మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు….
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరికి జైలు శిక్ష.. తొమ్మిది మందికి జరిమానా….
–ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, రామగుండం ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 11 మందిని గోదావరిఖనిలోని రెండో అదనపు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో పట్టుబడిన వారిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, తొమ్మిది మందికి మొత్తం రూ.15,500 జరిమానా విధించింది. మరో ఇద్దరు ఆటో డ్రైవర్లకు ఒకరికి ఒక రోజు, మరొకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించింది. అనంతరం వారిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
వాహనదారులు తప్పనిసరిగా వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. అలాగే రాంగ్రూట్లో ప్రయాణించకూడదని, అతివేగంగా వాహనాలు నడపరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
