కాంగ్రెస్ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి…

Sakshitha news

కాంగ్రెస్ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలి…

— ప్రభుత్వ విప్ విజయరమణ రావు…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: మేడ్చల్, :మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి జంగయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, రైతు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులకు పలు సూచనలు చేశారు.

కార్యక్రమానికి చేరుకున్న ప్రభుత్వ విప్ విజయరమణ రావుకు పార్టీ నాయకులు గజమాలలు, శాలువాలతో ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు.

ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో సింగిల్ విండో సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్ల నియామక ప్రక్రియలో భాగంగా స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఏకాభిప్రాయంతో పేర్లను పార్టీ అధిష్ఠానానికి, ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. స్థానిక నాయకత్వానికి గౌరవం ఇస్తూ పారదర్శకంగా నియామకాలు చేపట్టాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన అని పేర్కొన్నారు.

మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునేలా ఇప్పటి నుంచే సమష్టిగా కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రైతుల సంక్షేమం, ప్రజలకు సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top